
చేవెళ్ల, వెలుగు: మహిళను హత్య చేసిన దుండగులు డెడ్బాడీని ఫాంహౌస్ లో పాతిపెట్టి పరారయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పీఎస్ పరిధిలో జరిగింది. ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల పట్టణానికి చెందిన కనకమామిడి మల్లారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డికి కలిపి శివారులో 20 గుంటల ఫాంహౌస్ ఉంది. ఆరాంఘర్కు చెందిన సత్య, కల్పన దంపతులు నెలరోజుల కిందట ఫాంహౌస్లో వాచ్మన్గా పనిలో చేరారు.
వీళ్లిద్దరు గురువారం సాయంత్రం సంపత్ అనే వ్యక్తితో పాటు మరో మహిళను తీసుకొని ఫాంహౌస్ ఓనర్ మల్లారెడ్డి దగ్గరికి వెళ్లారు. సంపత్, సదరు మహిళ తమకు బంధువులు అవుతారని, వాళ్లను కూడా ఫాంహౌస్లో పనిలో పెట్టుకోవాలని ఓనర్ను కోరారు. ఈ విషయంపై మరుసటి రోజు మాట్లాడుదామని చెప్పి మల్లారెడ్డి ఫాంహౌస్ నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం చేవెళ్లలోని మల్లారెడ్డి ఇంటికి వచ్చిన సత్య, కల్పన.. తాము ఫాంహౌస్లో పనిచేయమని చెప్పి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం ఫాంహౌస్కు వచ్చిన మల్లారెడ్డి వాకింగ్ చేస్తుండగా.. ఓ చోట బండ కదిలినట్లుగా అనిపించడంతో దాన్ని పక్కకు జరిపి చూశాడు.
మట్టిలో చీర కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మట్టిని పూర్తిగా తవ్వగా లోపల మహిళ డెడ్బాడీ ఉంది. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సత్య, కల్పన దంపతుల వెంట వచ్చిన సంపత్.. చేవెళ్లలోని ఉడిపి హోటల్లో పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫాంహౌస్లో హత్యకు గురైన ఆమె.. సంపత్ వెంట వచ్చిన మహిళ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులు మహిళను హత్య చేసి.. ఫాంహౌస్లో కొత్తగా వేసిన బండలను తీసి మట్టిని తవ్వి అందులో పాతిపెట్టారన్నారు. ఆ తర్వాత యదావిధిగా బండలను మట్టిపై పరిచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సత్య, కల్పన దంపతుల కోసం గాలిస్తున్నామన్నారు. చనిపోయిన మహిళ చేవెళ్లలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో ఉండేదని.. ఆమెకు సంబంధించి పూర్తి వివరాలు తెలియదని పోలీసులు చెప్పారు.