V6 News

కేంద్రం దొంగచాటుగా ధరలు పెంచుతోంది : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 కేంద్రం దొంగచాటుగా ధరలు పెంచుతోంది : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ

ఖమ్మం టౌన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధరలు పెంచుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం రఘునాథపాలెం రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి కలెక్టర్‌‌ దివాకర టీఎస్‌‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కేంద్రం పెట్రో ధరలు పెంచడం వల్ల కంపెనీలకు నష్టం వస్తోందని, అందుకే అవి సప్లై చేయలేకపోతున్నాయన్నారు. పెట్రో ఉత్పత్తుల కొరత కారణంగా హార్వస్టర్లు, ట్రాక్టర్లు నడవడం లేదని, దీంతో వ్యవసాయ రంగంపై ప్రభావం పడుతోందన్నారు.

స్థానిక రైతులను కాదను ఇతర దేశాల నుంచి మక్కలు కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు. స్థానిక రైతులు పండించే పంటలను ఇక్కడే కొనాలని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని ఆపేయాలని డిమాండ్‌‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుందే తప్ప ఒక్క గింజను కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతకుముందు ఖమ్మం కార్పొరేషన్‌‌లోని 16వ డివిజన్‌‌లో సీసీ రోడ్లు, సైడ్‌‌ డ్రైన్‌‌ పనులకు శంకుస్థాపన చేశారు.