హైదరాబాద్ టిఫిన్ సెంటర్ల ముందు ఏందీ జనం.. రేట్లు పెంచారని తెలిసి కూడా..

హైదరాబాద్ టిఫిన్ సెంటర్ల ముందు ఏందీ జనం.. రేట్లు పెంచారని తెలిసి కూడా..

గ్యాస్ ​దొరకడం లేదని, కమర్షియల్​సిలిండర్లకు ఎక్కువ రేటు చెల్లించాల్సి వస్తోందని, వంట నూనెల దిగుమతి సుంకం పెరిగిందని.. ఇలా రకరకాల సాకులతో హోటల్ నిర్వాహకులు ఫుడ్ ఐటమ్స్ రేట్లను అడ్డగోలుగా పెంచేశారు.

ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ముడిసరుకుల వ్యయం కేవలం ఐదు శాతం పెరిగితే.. హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు మాత్రం రాత్రికి రాత్రే 25 నుంచి 30 శాతం మేర రేట్లు పెంచాయి. రేటు మార్చుతూ పాత మెనూ కార్డులపై కొత్త స్టిక్కర్లు అంటించారు. ఇరానీ చాయ్ దగ్గరి నుంచి బిర్యానీ దాకా అన్నింటి ధరలూ పెంచేశారు. ఒక్కో ఇరానీ చాయ్పై రూ.5 నుంచి రూ.10 దాకా పెంచడం గమనార్హం. 

ఇక సామాన్యుడి బ్రేక్ ఫాస్ట్ అయిన ఇడ్లీ, దోశ, వడ ధరలు ప్లేట్‌‌పై కనీసం రూ.10 నుంచి రూ.20 మేర పెంచారు. మొన్నటి వరకు రూ.120 నుంచి రూ.150కి దొరికే సింగిల్ బిర్యానీ ఇప్పుడు ఏకంగా రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగి రూ.200కు చేరింది. దీనికి తోడు ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ ఫీజుల పేరుతో ఆన్‌‌లైన్‌‌ ఫుడ్ డెలివరీ యాప్స్‌‌లో (స్విగ్గీ, జొమాటో వంటివి) అదనంగా మరో 20 నుంచి 30 శాతం వరకు బాదుతున్నారు. 

దీంతో అమీర్‌‌పేట, కూకట్‌‌పల్లి, దిల్‌‌సుఖ్‌‌నగర్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో గదులు అద్దెకు తీసుకుని, రోజువారీ భోజనం కోసం బయటి ఫుడ్‌‌పైనే ఆధారపడే లక్షలాది మంది విద్యార్థులు, చిరుద్యోగులు, బ్యాచిలర్స్ జేబులకు చిల్లులు పడుతున్నాయి.

ఆన్‌‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ దోపిడీ ఒక ఎత్తయితే.. భాగ్యనగరంలో సామాన్యుడి ప్రయాణాన్ని శాసిస్తున్న క్యాబ్, ఆటో అగ్రిగేటర్లు ఓలా, ఉబర్‌‌ బాదుడు మరో ఎత్తు. ముడిచమురు ధరల పెరుగుదల, ఇంధన ఖర్చులను సాకును చూపుతూ.. ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి.

వాస్తవానికి స్థానికంగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌‌జీ ధరల్లో మార్పులేమీ లేకపోయినా కనీస చార్జీలను అమాంతం పెంచేశాయి. ఒకప్పుడు కిలోమీటరుకు రూ.10 నుంచి రూ.15 వరకు ఉండగా, ఇప్పుడు ప్లాట్‌‌ఫామ్ ఫీజుల పేరుతో రూ.25 నుంచి రూ.30కి పెంచాయి.