తిరుమల శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం

తిరుమల శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం

తిరుమల కొండ మరోసారి నిండింది. వారం రోజులుగా తిరుమలలో ఇదే  పరిస్థితి కొనసాగుతోంది. దసరా సెలవులు ముగిసినా.. రద్దీ మాత్రం తగ్గటం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు.. అటు తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో  వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరిలోని 9 షెడ్లు ఫుల్ అయ్యాయి. దీంతో గోగర్భం డ్యాం దగ్గర నుంచి భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 40గంటల సమయం పడుతోంది. టీటీడీ సిబ్బంది భక్తులకు అల్పహారం, మంచినీటిని అందిస్తున్నారు.

నారాయణగిరి విశ్రాంతి భవనం వెనుక భాగంలోని రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సర్వదర్శన భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా తిరుమలలో ఓ మోస్తరు వర్షం పడుతుండటంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో చాలా మంది భక్తులు అఖిలాండం దగ్గర కొబ్బరి కాయలు కొట్టి.. శ్రీవారిని దర్శించుకోకుండానే తిరుగు ప్రయాణం అవుతున్నారు.

గత వారం రోజులుగా తిరుమల కొండకు భక్తులు పోటెత్తున్నారు. దసరా సెలవులు రావడంతో భక్తులు భారీగా వస్తున్నారు. మరోవైపు తమిళులు పవిత్రంగా భావించే పెరటాశి మాసం చివరి వారం కావడంతో  భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.