తిరుమలలో వీఐపీ దర్శనాలన్నీ రద్దు

తిరుమలలో వీఐపీ దర్శనాలన్నీ రద్దు

తిరుమల సెప్టెంబర్ 18వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. తొమ్మిది రోజులు వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌రకు సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌రకు న‌వ‌రాత్రి  బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబ‌రు 18న ధ్వజారోహ‌ణం, సెప్టెంబ‌రు 22న గ‌రుడ వాహ‌నం, సెప్టెంబరు 23న స్వర్ణరథం, సెప్టెంబ‌రు 25న ర‌థోత్సవం(మ‌హార‌థం), సెప్టెంబ‌రు 26న చ‌క్రస్నానం కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో విఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. బ్రహ్మోత్సవాల కార‌ణంగా సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు, అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు పలు ఆర్జిత సేవలు రద్దు అయ్యాయి. తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. సర్వదర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ల ద్వారా భక్తులకే అవకాశం కల్పించింది. అటు  బ్రహ్మోత్సవాలకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు టిటిడి అధికారులు.

Also Read :- శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల‌కు విస్తృత ఏర్పాట్లు..

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మాడవీధులలో గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. ఆన్‌లైన్‌లో లక్షా 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. 

ప్రతి నిత్యం సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. అన్నప్రసాద సముదాయంలో నిత్యం లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. 3500 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.