కేసీఆర్ ముందు రాష్ట్రంపై దృష్టి పెట్టాలె

కేసీఆర్ ముందు రాష్ట్రంపై దృష్టి పెట్టాలె

హైదరాబాద్: పరిపాలన చేతగాకపోతే దిగిపోవాలని సీఎం కేసీఆర్ ను టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. కు.ని ఆపరేషన్ వికటించి మృతి చెందిన కుటుంబాలను శనివారం కోదండరాం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు చనిపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ అసమర్థ పాలనకు ఈ ఘటన ఉదాహరణ అని అన్నారు. వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసోందన్న ఆయన... అలా అయితే మౌళిక సదుపాయాలు ఎలా మెరుగుపడుతాయని ప్రశ్నించారు. హడావుడిగా 34 మందికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఆపరేషన్ తర్వాత  పేషెంట్లకు సరియైన మందులు ఇవ్వలేదని ఆరోపించారు. 

ఈ ఘటనకు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్న కోదండరాం... హరీశ్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జాతీయ రాజకీయాలు పక్కను పెట్టి... ముందు రాష్ట్ర సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టాలని తెలిపారు. కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారన్న కోదండరాం... ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో కేసీఆర్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.