- 4 వేదికలు..4 వేల మంది పోలీసులు.. లక్షల మందికి సీటింగ్
- వానకు ఉరువని టెంట్లు.. ప్రసంగాలు 2 కి.మీ. వినపడేలా స్పీకర్లు
- స్టేజీ కనిపించేలా భారీ స్క్రీన్లు.. భద్రతా దళాల గుప్పిట్లో సికింద్రాబాద్
- వివిధ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనాల పార్కింగ్కు 20 గ్రౌండ్లు
హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: ప్రధాని మోడీ బహిరంగ సభకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. పరేడ్గ్రౌండ్ చుట్టు పక్కల ప్రాంతాలన్నీ కటౌట్లు, జెండాలు, భారీ హోర్డింగులతో కాషాయమయం చేశారు. సభా ప్రాంగణంలో 4 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై పీఎం మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, గడ్కరీ, కిషన్రెడ్డి, రాష్ట్ర నేతలు సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ కూర్చుంటారు. రెండో వేదికపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూర్చుంటారు. మూడో వేదికపై పార్టీ జాతీయ నాయకులు ఉంటారు. సాంస్కృతిక ప్రదర్శనల కోసం నాలుగో వేదిక ఏర్పాటు చేశారు. వానొచ్చినా తడవకుండా వేదికలు, సభ ప్రాంగణంలో జర్మన్ హ్యాంగర్స్ వేయించారు. సుమారు 2 లక్షల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ, సభకు పది లక్షల మంది వస్తారని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణంలో అమర్చిన కుర్చీల మధ్యలో, ఖాళీ ప్రదేశం వదిలేశారు. సభకు వచ్చే మిగతావారంతా ఈ ఖాళీప్రదేశాల్లో కూర్చొని చూసేలా కింద కార్పెట్లు వేశారు. సభా ప్రాంగణం బయట ఉన్నవాళ్లు కూడా కార్యక్రమాలను చూసేందుకు ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. ప్రసంగాలు 2 కిలోమీటర్ల దూరం వరకు వినిపించేలా స్పీకర్లు పెట్టారు.
రోడ్డు మార్గంలో సభకు మోడీ
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ నోవాటెల్ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్స్కు రోడ్డు మార్గంలోనే రానున్నారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే రూట్ను ఎస్పీజీ ప్రత్యేకంగా పరిశీలించింది. ప్రధానితో పాటు సమావేశాల్లో పాల్గొన్న ఇతర ముఖ్య నేతలు కూడా సభలో పాల్గొననున్నారు. వీళ్లంతా మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ కు వివిధ రూట్లలో ప్రయాణించనున్నారు. అందుకు అనుగుణంగా టివోలి క్రాస్ రోడ్స్, ప్లాజా క్రాస్ రోడ్స్ మధ్య రోడ్డును మూసేయడంతో పాటు సికింద్రాబాద్ పరిధిలో ఉండే ఫ్లైఓవర్లు
క్లోజ్ చేయనున్నారు.
3 కి.మీ. చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. జిల్లాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 20 గ్రౌండ్లను కేటాయించారు. ఆయా పార్కింగ్ ప్రాంతాల గూగుల్ మ్యాప్ వివరాలు పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ట్రాఫిక్ డైవర్షన్లు ఇట్ల..
ఉప్పల్ నుంచి పంజాగుట్ట వైపు: రామంతాపూర్, అంబర్పేట్, హిమాయత్నగర్, వీవీ విగ్రహం మీదుగా పంజాగుట్టకు చేరుకోవాలి.
మెట్టుగూడ నుంచి అమీర్పేట్ వైపు: సంగీత్ క్రాస్ రోడ్స్, చిలకలగూడ, కవాడిగూడ,- లోయర్ ట్యాంక్ బండ్, ఇక్బాల్ మినార్,- లక్డీకాపూల్, పంజాగుట్ట మీదుగా మళ్లిస్తారు.
పంజాగుట్ట నుంచి తార్నాక,ఉప్పల్ వైపు: ఖైరతాబాద్, నిరంకారి, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కవాడిగూడ, మెట్టుగూడ వైపు మళ్లిస్తారు.
మేడ్చల్, బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపు: బోయినపల్లి క్రాస్ రోడ్స్ వద్ద డెయిరీ ఫామ్ రోడ్డు, హోలీఫ్యామిలీ చర్చి - తిరుమలగిరి, ఆర్కేపురం, నేరెడ్మెట్, మల్కాజిగిరి, మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ డైవర్ట్ చేస్తారు.
కార్ఖానా,తిరుమలగిరి నుంచి ప్యాట్నీ వైపు: తిరుమలగిరి క్రాస్ రోడ్స్ వద్ద ఆర్కే పురం, నేరెడ్మెట్, మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ వైపు మళ్లిస్తారు.
పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ స్టేషన్: వీవీ విగ్రహం, ఐమాక్స్ రోటరీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీ హాస్పిటల్ నుంచి స్టేషన్కు మళ్లిస్తారు.
ఉప్పల్, తార్నాక,ఆలుగడ్డబావి, చిలకలగూడ ఎక్స్రోడ్ నుంచి ఫ్లాట్ఫామ్ నంబర్10కి చేరుకోవాల్సి ఉంటుంది.
జర్మన్ హ్యాంగర్స్
వర్షం వచ్చినా సభకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఉండేందుకు దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 భారీ జర్మన్హ్యాంగర్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎండ బాగా ఉంటే ఇబ్బంది తలెత్తకుండా.. వంద ఏసీలను సిద్ధం చేశారు. విద్యుత్తు సమస్యలు తలెత్తితే.. ప్రత్యామ్నాయంగా సభా ప్రాంగణంలో 50 జనరేటర్లను అందుబాటులో ఉంచారు.
4 వేల మంది పోలీసులు
పరేడ్ గ్రౌండ్ సభకు ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జాతీయ నిఘా సంస్థలు, ప్రత్యేక బృందాలు ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. దాదాపు 4 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారు. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్పై ఇద్దరు కానిస్టేబుళ్లు, బైనాక్యులర్స్తో
నిఘా పెట్టారు.