ఇవాళ నాగర్​కర్నూల్​లో మోదీ సభ

ఇవాళ నాగర్​కర్నూల్​లో మోదీ సభ

నాగర్ కర్నూల్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాగర్ కర్నూల్​ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. కొల్లాపూర్​ చౌరస్తా సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీజీ అధికారుల బృందం పర్యవేక్షణలో జిల్లా పోలీస్, ఇంటెలిజెన్స్​ ఆఫీసర్లు మూడు వేదికలు ఏర్పాటు చేశారు. సభకు లక్ష మందిని సమీకరించాలని టార్గెట్​ పెట్టుకున్నారు. సభకు పోలీస్​ భద్రత కల్పిస్తుండగా, నాగర్​కర్నూల్​కు రహదారులపై పోలీసు నిఘా పెంచారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతలు డీకే అరుణ, ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్, ఎంపీ పోతుగంటి రాములు, వనపర్తి జడ్పీ చైర్మన్​ లోక్​నాథ్​రెడ్డి, మహబూబ్​నగర్​ డీసీసీబీ డైరెక్టర్​ జక్కా రఘునందన్​ రెడ్డి, దిలీపాచారి మాట్లాడుతూ వెనకబడిన నాగర్​ కర్నూల్​ జిల్లాలో పార్లమెంట్​ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు మోదీ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్​ బీజేపీ ఎంపీ క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపించి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. 

35 ఏండ్ల తర్వాత..

ప్రధాని హోదాలో దివంగత రాజీవ్​గాందీ 1989లో పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్​ కర్నూల్, కల్వకుర్తి సభల్లో పాల్గొన్నారు. 35 ఏండ్ల తర్వాత నాగర్​ కర్నూల్​కు ప్రధాని హోదాలో ఎన్నికల సభలో పాల్గొనేందుకు మోదీ వస్తున్నారు. ఉదయం 11.45 నిమిషాలకు బేగంపేట ఎయిర్​పోర్ట్​ నుంచి హెలిక్యాప్టర్​లో నాగర్​ కర్నూల్​కు బయలుదేరుతారని అధికారులు తెలిపారు. బహిరంగసభలో పాల్గొని12.45కు తిరిగి వెళ్తారు.