హైదరాబాద్, వెలుగు: ఓ సినీ ఫైనాన్షియర్ చేస్తున్న డ్రగ్స్, వ్యభిచారం దందాను యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు బ్రేక్ చేశారు. బుధవారం అర్ధరాత్రి పక్కా సమాచారంతో హైదరాబాద్ మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్పై రెయిడ్స్చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కేసు వివరాలను టీ న్యాబ్ వెస్ట్ ఎస్పీ సునీతారెడ్డి గురువారం వెల్లడించారు. కొంత కాలంగా డ్రగ్స్ సప్లయర్లపై నిఘా పెట్టిన టీఎస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీ న్యాబ్).. నైజీరియన్స్తో కాంటాక్ట్లో ఉన్నపెడ్లర్, నేవీ మాజీ ఉద్యోగి బాలాజీ (34) సమాచారం సేకరించింది. గతంలో ఇతడు డ్రగ్స్, వ్యభిచారం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించింది. ఫిల్మ్ ఫైనాన్షియర్ వెంకటరత్నా రెడ్డి(47) ఆర్గనైజ్ చేస్తున్న పార్టీలకు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు తెలుసుకుంది. బుధవారం రాత్రి గుడిమల్కాపూర్లో బాలాజీని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 15 ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
అలాగే, అతడు ఇచ్చిన సమాచారంతో మాదాపూర్ విఠల్రావు నగర్లోని ఓ అపార్ట్మెంట్లో టీన్యాబ్ డీఎస్పీ నర్సింగ్రావు ఆధ్వర్యంలో రెయిడ్స్ నిర్వహించారు. అక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న వెంకటరత్నా రెడ్డితో పాటు వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన కంజ్యూమర్, రైల్ నిలయం సీనియర్ స్టెనోగ్రాఫర్ డి మురళి(42)ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.8 గ్రాముల కొకైన్, 6 ఎల్ఎస్డీ బ్లాట్స్, 11.5 గ్రాములు గల 25 ఎక్స్టసీ పిల్స్, రెండు గంజాయి ప్యాకెట్స్, రూ.75 వేల క్యాష్, రెండు కార్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులనూ రెస్క్యూ చేశారు. పార్టీలో మొత్తం 18 మంది డ్రగ్ కంజ్యూమర్స్ పాల్గొన్నట్లు గుర్తించారు. నిందితులను గురువారం రిమాండ్కు తరలించారు. నిందితుల కాల్డేటా, వాట్సాప్ చాటింగ్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజులు కస్టడికీ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు.
భారీ సినిమాల ఫైనాన్సియర్ డ్రగ్స్ పార్టీలు
గుంటూరు నెహ్రూనగర్కు చెందిన వెంకటరత్నా రెడ్డి ఢమరుకం, కిక్, బిజినెస్మెన్, లవ్లీ, ఆటోనగర్ సూర్య తదితర సినిమాలకు ఫైనాన్స్ చేశాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని యువతులనూ ట్రాప్ చేసేవాడు. సిటీలోని సర్వీస్ ఆపార్ట్మెంట్స్లో రూమ్స్ అద్దెకు తీసుకుని ఫ్రెండ్స్, ఇండస్ట్రీలోని డ్రగ్స్ కంజ్యూమర్స్తో పార్టీలు నిర్వహించేవాడు. నెల్లూరు జిల్లాకు చెందిన బాలాజీ వద్ద పెద్ద మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసి కంజ్యూమర్స్కు అందించేవాడు.
మాజీ నేవీ ఉద్యోగి డ్రగ్స్ దందా
ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన బాలాజీ మాజీ నేవి ఉద్యోగి. కంటి గాయంతో ఉద్యోగం కోల్పోయాడు. ఈ క్రమంలో బెంగళూరులోని ముగ్గురు నైజీరియన్స్, వైజాగ్లో నివాసం ఉండే మరో డ్రగ్ పెడ్లర్తో పరిచయం ఏర్పడింది. వీరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసి పార్టీల్లో సేల్ చేసేవాడు. క్రమంగా డ్రగ్స్ పార్టీలు ఆర్గనైజ్ చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్, బెంగళూరులో నివాసం ఉంటున్న నైజీరియన్ డ్రగ్ పెడ్లర్స్ వద్ద కొకైన్, ఎక్సటసీ పిల్స్, ఎల్ఎస్డీ బ్లాట్స్ కొనుగోలు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే సినీ ఫైనాన్సియర్ వెంకటరత్నా రెడ్డి నిర్వహించే పార్టీలకు పెద్ద మొత్తంలో డ్రగ్స్ సప్లయ్ చేసేవాడు.