సీఎం కేసీఆర్ ప్రజల్ని ప్రజలుగా చూడటం లేదని వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడన్నారు పీసీసీ కోశాధికారి గుడూరు నారాయణ రెడ్డి. ప్రజలకు ఓ రోల్ మోడల్ గా ఉండాల్సిన సీఎం.. కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టాన్స్ పాటించకుండా రిజర్వాయర్ల ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు. .మాస్కు కూడా ధరించకుండా 2000 మందితో కోండపోచమ్మకు వెళ్లారని మండిపడుతూ.. ప్రజలకు కరోనా పై ఏలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇక ప్రజలు మాత్రం సోషల్ డిస్టాన్స్ ఎలా పాటిస్తారని అన్నారు.
ఈనెల 20నుంచి పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెద్దసంఖ్యలో పెరుగుతున్నాయని నారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ల్యాబుల్లో పరీక్షలు చేస్తేనే ఇన్ని పాజిటివ్ కేసులొస్తున్నాయని, ప్రైవేటు ల్యాబుల్లో చేస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తాయని చెప్పారు. ప్రైవేటు హాస్పత్రుల్లో కరోనా చికిత్స చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. హైదరాబాద్ లో రోజు విడిచి రోజు షాపులు తెరుచుకోవచ్చని చెప్పి, మళ్లీ మాట మార్చారని… ప్రస్తుతం అన్ని షాపులు ఓపెన్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఖజానా నింపుకోవడాని మాత్రమే ఆలోచించవద్దని, ప్రజల ప్రాణాల గురించి కూడా ఆలోచించాలన్నారు నారాయణ రెడ్డి. ఇతర దేశాలను చూసైనా సీఎం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.