గులాబ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చిచేరుతోంది. దీంతో రెండు జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది. చాదర్ఘాట్ దగ్గర వంతెనను ఆనుకుని మూసీ ప్రవహిస్తోంది. దీంతో GHMC, పోలీసు అధికారులు అలర్టై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మూసారాంబాగ్ వంతెనతో పాటు చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జిపైకి రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరీవాహక ప్రాంతాలకు చిన్నారుల రావొద్దని హెచ్చరించారు. చాదర్ఘాట్, శంకర్నగర్ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో కోఠి,చాదర్ ఘాట్ దారిలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. GHMC అధికారులు, పోలీసులు కలిసి సమన్వయ చర్యలు చేపట్టారు.
హిమాయత్ సాగర్ జలాశయంలో రెండు అడుగుల మేర 8 గేట్లు ఎత్తిన జలమండలి అధికారులు 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గండిపేట్ జలాశయం 6గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదిలారు. హిమాయత్ సాగర్, గండిపేట్ దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు.