తెలంగాణ ప్రభుత్వ నూతన సచివాలయం ఏప్రిల్ 30వ తేదీ ఆదివారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హుస్సేన్ సాగర్,సైఫాబాద్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్, లుంబనీ పార్క్, నెక్లెస్ రోడ్డును పూర్తిగా మూసి వేస్తున్నట్టు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు వెల్లడించారు. వీఐపీల రాకపోకలను బట్టి పీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్ను నిలిపివేయడం, మళ్లింపులు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులు మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి ట్రాఫిక్కు అనుమతి లేదన్నారు. ట్యాంక్బండ్, తెలుగుతల్లి, బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్లో వాహనాలకు ఎంట్రీ లేదని తెలిపారు. ఆర్టీసీ బస్సులు లోయర్ ట్యాంక్బండ్,కవాడిగూడ మీదుగా మళ్లిస్తున్నట్టు చెప్పారు. ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించామని, సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్లను కార్లకు అతికించుకోవాలని సూచించారు అదనపు సీపీ సుధీర్బాబు.