కట్టెల లారీ బోల్తా.. హైదరాబాద్ విజయవాడ హైవేపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

కట్టెల లారీ బోల్తా.. హైదరాబాద్  విజయవాడ హైవేపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఇనాంగుడ దగ్గర కర్ర చెక్కలతో వెళ్తోన్న  లారీ  బోల్తా పడింది . దీంతో హైదరాబాద్ -విజయవాడ హైవేపై   దాదాపు  10   కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.   ఘటనా స్థలానికి వచ్చిన వనస్థలిపురం, అబ్ధుల్లాపూర్ మెట్  ట్రాఫిక్ పోలీసులు  మూడు జేసీబీ లు,రెండు క్రేన్ లతో క్లియర్ చేస్తున్నారు. కర్రచెక్కలను పక్కకు తొలగిస్తున్నారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే సమయంలో కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

హైవేపై ఎక్కడ ప్రమాదం జరిగినా, ట్రాఫిక్ జామ్ అయినా.. కమాండ్ కంట్రోల్ కి సమాచారం అందేలా డ్రోన్లతో నిఘా పెట్టారు. ప్రజలు సేఫ్​గా గమ్య స్థానాలు చేరేలా భద్రతా చర్యలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా మీదుగా వెళ్లే ఎన్ హెచ్ 65 రహదారిపై 24 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో పోలీస్ సిబ్బంది, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలతో పాటు డ్రోన్లను రంగంలోకి దించారు.

పండుగకు 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత వరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రస్తుతం గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ వైపు వెళ్లే వాహనాలు నార్కెట్​పల్లి మీదుగా, రాజమండ్రి, వైజాగ్ వైపు వెళ్లే వాహనాలు నకిరేకల్, టేకుమట్ల వద్ద దారి మళ్లిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ సిబ్బందితో పోలీస్ పికెట్లు, పోలీస్ పెట్రోలింగ్, క్రేన్లు ఏర్పాటు చేశారు. 24 గంటలు పర్యవేక్షించేలా డ్రోన్లు ఏర్పాట్లు చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతాలకు వెంటనే పోలీస్ సిబ్బంది చేరుకుని క్లియర్ చేస్తారు.