జులై 4వ తేదీ మంగళవారం హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. సైబరాబాద్ పరిధిలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి రోడ్డు వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఏ ఏ ప్రాంతాల్లో ఆంక్షలు..
జులై 4వ తేదీ మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము....గచ్చిబౌలిలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి నుంచి లింగంపల్లి రోడ్డు వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రాష్ట్రపతి పర్యటనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.