
- మియాపూర్లో ఘటన
- స్కూల్ యాజమాన్యం ఓవరాక్షన్తో ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్య !
మియాపూర్, వెలుగు: వారం కింద తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. అందుకు నీవే కారణమని మృతుడి బంధువులు తిట్టడంతో పదో తరగతి విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ డి బ్లాక్ నాలుగో అంతస్తులో నివాసముంటున్న బిజయ్ నాయక్, చిన్మయి నాయక్ దంపతులు. వీరి కుమార్తె హన్సిక నాయక్(15) మాధవ్ నగర్లోని సెయింట్ మార్టిన్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. అదే స్కూల్లో మియాపూర్ మాధవనగర్కాలనీకి చెందిన షేక్ అహ్మద్, జహీరు నిస్సాబేగం దంపతుల కొడుకు రిజ్వాన్(15) చదువుతున్నాడు.
వీరిద్దరు కొద్ది రోజులుగా చాటింగ్ చేసుకుంటుండగా, స్కూల్ టీచర్ గమనించి ప్రిన్సిపాల్కు తెలిపింది. దీంతో ఈ నెల 19న ఇరువురు తల్లిదండ్రులను స్కూల్కు పిలిపించి మాట్లాడుతుండగా, చాటింగ్ విషయం తన తల్లికి తెలిసిందని రిజ్వాన్ స్కూల్ బిల్డింగ్ ఐదో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత వరుసగా స్కూల్కు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. మరుసటి రోజు గురువారం హన్సిక.. తండ్రితో కలిసి స్కూల్కు వెళ్లింది.
స్కూల్ యాజమాన్యం ఓవరాక్షన్..
స్కూల్కు వెళ్లిన హన్సికను టీచర్లు అనుమతించలేదు. ముందుగా రిజ్వాన్ కుటుంబ సభ్యులను పరామర్శించాలని, ఆ తరువాత స్కూల్కు రావాలని హన్సిక తండ్రికి ప్రిన్సిపాల్ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే హన్సికతో పాటు తండ్రి బిజాయ్ నాయక్ మాధవ్ నగర్ లోని రిజ్వాన్ ఇంటికి వెళ్లారు.
మృతుడి కుటుంబ సభ్యులు వారిని దూషించారు. ‘నా కొడుకు చనిపోయినట్టే.. చావు’ అంటూ హన్సికపై మండిపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి వెళ్లగానే ఐదో అంతస్తు నుంచి కిందికి దూకి సూసైడ్ చేసుకుంది.ఈ ఘటనపై పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.
బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
ఘట్కేసర్: రైలు కింద పడి ఓ బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి -భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం మోదుగాయగూడేనికి చెందిన ఉప్పుల రాజేందర్(21) పోచారం మున్సిపాలిటీ యనంపేటలో ఓ హస్టల్లో ఉంటూ శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. గురువారం తెల్లవారుజామున యంనంపేట్ రైల్వే బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు డెడ్బాడీని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు.