
మరీ సీరియస్ గా ఉంటేనే హాస్పిటల్లో ఉంచుతున్న డాక్టర్లు
మామూలు జ్వరం, దగ్గు ఉంటే పాజిటివ్ అయినా ఇంటికే..
చిన్న ఇండ్లలో హోం ఐసోలేషన్ కష్టమన్నా వింటలేరు
ఫ్యామిలీ మెంబర్స్కు, ఇతరులకు సోకుతుందనే ఆందోళన
వారిని ఊర్లలోకి రాకుండా అడ్డు పడుతున్న జనం
సర్కారు బడులు, పొలాల్లో నే ఉంటూ ఆగమైతున్న పేషెంట్లు
కిటికీలోంచి దీనంగా చూస్తున్న ఈ వ్యక్తికి వారం కింద కరోనా సోకింది. ఊరు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్ల. ఆరు రోజుల నుంచి ఊరు చివరిలోని సర్కార్ బడిల ఒంటరిగా ఉంటున్నడు. కరోనా పాజిటివ్ వచ్చిన ఇతడ్ని డాక్టర్లు దవాఖానల ఉంచుకోలేదు. ఇంటికి పొమ్మన్నరు. ఇంట్లో ఉందామని వస్తే.. తమకేడ కరోనా అంటుతదోనని ఊరోళ్లు రానియ్యలేదు. దీంతో సర్కార్ బడిలనే ఒంటరిగా ఉంటున్నడు. సర్పంచే రోజు ఇట్ల ఇంత తిండిని ప్యాకెట్ల తెచ్చి అరుగు మీద పెట్టి వెళ్లిపోతున్నడు. తర్వాత ఆ పేషెంట్ వచ్చి అన్నం తీసుకొని తింటున్నడు.
కరోనా నుంచి పూర్తిగా కోలుకోకముందే పేషెంట్లను ఆస్పత్రులు ఇంటికి పంపిస్తున్నాయి. లక్షణాలు లేవంటూ కొందరినీ..రిపోర్టులు రాకున్నా ఇంకొందరిని డిశ్చార్జ్ చేస్తున్నాయి. ఇలా ఇళ్లకు వస్తున్న పేషెంట్లతో తమకెక్కడ వైరస్ అంటుకుంటుదోనని జనం భయపడి ఊర్లకు రానిస్తలేరు. అటు దవాఖాన్లలో ఉండలేక ఇటు ఇంటికి రాలేక పేషెంట్లు సతమతమవుతున్నారు. సర్కారు తొమ్మిది జిల్లా హాస్పిటళ్లలో కరోనా యూనిట్లను ఏర్పాటు చేసింది. ఆయా చోట్ల గతంలో ఉన్న ఐసోలేషన్ వార్డులనే అప్ గ్రేడ్ చేసి.. కరోనా యూనిట్లుగా మార్చింది. ఎమర్జెన్సీ కోసం ఐసీయూలు ఏర్పాటు చేసి, అక్కడే ట్రీట్మెంట్ చేయాలని.. అత్యవసరమైతేనే గాంధీకి పంపాలని ఆదేశించింది. కానీ కొత్త రూల్స్ ప్రకారం మైల్డ్ సిప్టమ్స్ ఉంటే హోం ఐసోలేషన్కు పంపుతున్నారు.
కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండి, ఆక్సిజన్, మెడికేషన్ అవసరమయ్యే లెవల్–2 మోడరేట్కేసులను హాస్పిటల్ ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వెంటిలేటర్ అవసరమయ్యే లెవల్ –3 కేసులనూ జిల్లాల్లోనే ట్రీట్ మెంట్ చేయాలని, మరీ సీరియస్ గా ఉంటే తప్ప గాంధీకి రెఫర్ చేయవద్దని సర్కారు ఆదేశించింది. దీంతో మైల్డ్ సిప్టమ్స్ ఉన్న చాలా మంది పేషెంట్లను డాక్టర్లు ఇండ్లకు పంపేస్తున్నారు.
ఊర్లలో ఆందోళన
కొద్దిపాటి లక్షణాలున్న కరోనా పేషెంట్లను డాక్టర్లు ఇండ్లకు పంపేస్తున్నా గ్రామాల్లో జనం అడ్డుకుంటున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో రెండు చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. పోలీసులు, ఆఫీసర్లు రంగంలోకి దిగి కరోనా పేషెంట్లను ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో ఐసోలేషన్చేయాల్సి వచ్చింది. ఆఫీసర్ల లెక్కల ప్రకారం సోమవారం నాటికి మంచిర్యాల జిల్లాలో ఒకరు, మహబూబ్ నగర్ జిల్లాలో 17 మంది, సిద్దిపేట జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లి జిల్లాలో ఆరుగురు, యాదాద్రి జిల్లాలో తొమ్మిది మంది, జగిత్యాల జిల్లాలో ఎనిమిది మంది, ఖమ్మం జిల్లాలో ముగ్గురు , కరీంనగర్ జిల్లాలో ఒకరు, నల్గొండ జిల్లాలో ఇద్దరు పాజిటివ్ పేషెంట్లు హోం ఐసోలేషన్లో ఉన్నారు. మరికొన్ని జిల్లాల్లో ఆఫీసర్లు ఈ లెక్కలు చెప్పడంలేదు. దీనికి తోడు పది పదిహేను రోజులుగా హాస్పిటళ్లలో ఉంచుకుని, టెస్టులు చేయకుండానే, నెగెటివ్ గా తేలకుండానే ఇంటికి పంపేస్తున్న పేషెంట్లు మరికొందరు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో ఆదివారం 9 మందిని ఇలాగే డిశ్చార్జి చేశారు. తమకు పాజిటివో, నెగెటివో తెలియని స్థితిలో ఇండ్లకు చేరుకున్న వీళ్లను చూసి ఊర్లలో జనం వణికిపోతున్నారు.
ఇండ్లలో జాగ ఏడుంది?
కరోనా పాజిటివ్ పేషెంట్లలో చాలామందికి హోం ఐసోలేషన్ పెద్ద సమస్యగా మారింది. పెద్ద ఇండ్లలో సెపరేట్ రూములున్న వాళకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకున్నా.. చిన్నచిన్న ఇండ్లలో, ఒకట్రెండు రూముల్లోనే ఫ్యామిలీ అంతా ఉండేచోట ఇబ్బందులు వస్తున్నాయి. తమ ద్వారా ఇంట్లో వాళ్లకు ఎక్కడ వైరస్ అంటుతుందోనని పాజిటివ్ పేషెంట్లు భయంభయంగా గడుపుతున్నారు. హోం ఐసోలేషన్లో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండకుంటే.. ఇంట్లో వాళ్లకు వాళ్ల నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఎక్స్ పర్ట్స్, డాక్టర్లే స్పష్టం చేస్తున్నారు. పాజిటివ్ వాళ్లు పూర్తిగా కోలుకునే దాకా హాస్పిటల్లోనే ఉంచాలని, నెగెటివ్ వచ్చాకే ఇండ్లకు పంపాలని ఊర్లలోని జనం సర్కారును డిమాండ్ చేస్తున్నారు.