భూమి విషయంలో కొట్లాడారని గ్రామం నుంచి వెలి

భూమి విషయంలో కొట్లాడారని గ్రామం నుంచి వెలి
  • పోలీసులకు గిరిజనుల ఫిర్యాదు

వెంకటాపురం (ములుగు జిల్లా), వెలుగు: గ్రామం నుంచి తమను వెలి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామం కొమ్రం భీం కాలనీకి చెందిన గిరిజనులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం క్రితం బెస్తగూడెం గ్రామ సమీపంలోని 5 ఎకరాల భూమి విషయంలో గ్రామస్థుల మధ్య కొట్లాట జరిగింది. అప్పటినుంచి కొమ్రం భీం కాలనీకి చెందిన గిరిజనులను బెస్తగూడెంలోకి రానివ్వకుండా ఆంక్షలు విధించారని వాపోయారు.

దుకాణాలలో సరుకులు అమ్మడం లేదని, పిల్లలను అంగన్ వాడీ, స్కూల్స్ కి రానివ్వడం లేదని, రేషన్ షాపులో బియ్యం సైతం ఇవ్వడం లేదని అన్నారు. కొమ్రం భీం కాలనీకి చెందిన గిరిజనులను కూలి పనులకు పిలవద్దని, ఎటువంటి సాయం చేయొద్దని గ్రామంలోని కొందరు వ్యక్తులు హుకుం జారీ చేసినట్లు చెప్పారు. గిరిజనులైన తమపై వివక్ష చూపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.