రాజ్యసభలో మరో ఎంపీపై సస్పెన్షన్వేటు పడింది. అనుచిత ప్రవర్తన కారణంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభ్యుడు డెరెక్ ఓబ్రియెన్ను ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సస్పెండ్ చేశారు. ఈ సీజన్ పార్లమెంట్ సమావేశాల మొత్తానికి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం (ఆగస్టు 7న) జరిగిన చర్చ సందర్భంగా ఓబ్రియెన్ తీరుపై ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పబ్లిసిటీ కోసం ఆయన సభలో నాటకీయంగా వ్యవహరిస్తున్నారని ధన్ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓబ్రియెన్ ప్రసంగం నుంచి కొన్ని కామెంట్స్ను రికార్డుల నుంచి తొలగించారు.
ALSO READ :బీజేపీ ఎంపీ మాటలకు.. పగలబడి నవ్విన సోనియాగాంధీ
ఈ క్రమంలోనే ఓబ్రియెన్ను సభ నుంచి సస్పెండ్ చేయాలని రాజ్యసభా పక్ష నేత పీయూష్ గోయల్ మంగళవారం (ఆగస్టు 8న) తీర్మానం ప్రవేశపెట్టారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రియెన్ సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, అందుకే ఆయన్ను ఛైర్మన్ను అగౌరవపరుస్తున్నారని తీర్మానంలో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం (ఆగస్టు 8న) ఓటింగ్ జరిపిన ఛైర్మన్.. ఓబ్రియెన్ను ఈ సీజన్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సభను ఛైర్మన్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.