
- కేంద్ర కార్యదర్శి అనురాగ్ జైన్కు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వినతి
న్యూఢిల్లీ, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జాతీయ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే, నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్సీ) సమావేశం ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని కోరారు.
రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రహదారుల నిర్మాణాలపై అనురాగ్ జైన్తో కూలంకషంగా మంత్రి చర్చించారు. కాగా, నల్గొండ బైపాస్ నిర్మాణంపై వారంలో ఎస్ఎఫ్సీ ఏర్పాటు చేస్తామని అనురాగ్ జైన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు.