BMW కారు కట్నం దగ్గర పెళ్లి ఆగిపోయింది.. యంగ్ డాక్టర్ ఆత్మహత్య

BMW కారు కట్నం దగ్గర పెళ్లి ఆగిపోయింది.. యంగ్ డాక్టర్ ఆత్మహత్య

కేరళలో దారుణ సంఘటన జరిగింది. వివాహం రద్దు అయిందన్న కారణంతో 26 ఏళ్ల పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..

షహానా (26) అనే 26 ఏళ్ల యువతి కేరళలోని తిరువనంతపురం మెడికల్‌ కాలేజీలో పీజీ చదువుతోంది. ఈ క్రమంలోనే షహానా, తన క్లాస్‌మేట్‌తో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.  పీజీ డాక్టర్‌ అయిన తన స్నేహితుడు పెళ్లి ప్రస్తావన నుంచి విరమించుకోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపించారు. 


అయితే ఇదే సమయంలో పెళ్లి కొడుకు తరఫున వారు భారీగా కట్నం డిమాండ్‌ చేశారు. వరకట్నంలో భాగంగా బంగారం, భూమి, బీఎమ్‌డబ్ల్యూ కారు రూపంలో వరకట్నం అడిగారు. దీంతో అంత కట్నం ఇచ్చుకోలేమని షహానా కుటుంబం చెప్పింది. అడిగినంత కట్నం ఇవ్వని కారణంతో పెళ్లికొడుకు తరపున వారు వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మనస్థాపానికి గురైన షహానా.. అపార్ట్‌మెంట్‌లో  బలవన్మరణానికి పాల్పడింది. అందరికీ డబ్బే కావాలి అంటూ ఓ సూసైడ్‌ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

దీంతో మెడికల్ కాలేజీ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. షహానా మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ విచారణకు ఆదేశించారు. సరైన విచారణ జరిపి నివేదికను సమర్పించాలని, మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు. 

కేరళ మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్‌ అడ్వకేట్ సతీదేవి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ మేరకు ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి నివేదిక కోరారు.  షహానా కుటుంబాన్ని పరామర్శించిన కేరళ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అడ్వకేట్ సతీదేవి.. ఈ అంశంపై సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ పోలీసుల నుంచి నివేదిక కోరనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ అన్ని బాధ్యతల నుంచి తొలగించింది. 


అధిక కట్నం డిమాండ్‌ చేసిన వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక వరకట్న వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని.. మెడికల్‌ పీజీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ బాధ్యతల నుంచి తొలగించారు.