పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్ లీడర్ దాడి

పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్ లీడర్ దాడి

కంప్లయింట్ ఇచ్చిన వ్యక్తిపై దుశ్చర్య

ఆసిఫాబాద్, వెలుగు: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై, పోలీసుల సమక్షంలోనే ఓ టీఆర్ఎస్ లీడర్ దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. కుమ్రం భీం ప్రాజెక్టు కింద సర్వం కోల్పోయిన భూనిర్వాసితుడు దాసరి వీరాంజనేయులుకు ప్రభుత్వం ఆసిఫాబాద్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో ఇంటి స్థలం కేటాయించింది. ఇదే స్థలంలో కాలనీకి చెందిన టీఆర్ఎస్ లీడర్, పాస్టర్ ఇరిగినాల తిరుపతి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇదేంటని ప్రశ్నించిన వీరాంజనేయులను బెదిరించాడు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అక్రమ నిర్మాణం చేపట్టవద్దని కోరారు. అయినా వెనక్కి తగ్గని తిరుపతి మళ్లీ నిర్మాణ పనులు మొదలుపెట్టాడు. దీంతో వీరాంజనేయులు, అతని కుటుంబసభ్యులు సోమవారం మళ్లీ పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. విషయం తెలుసుకున్న తిరుపతి అనుచరులు.. పోలీస్ స్టేషన్​కు చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో వీరాంజనేయులు, అతని కుటుంబసభ్యులపై దాడి చేశారు.

స్టేషన్ ముందు బాధితుల ధర్నా...

దాడి చేసిన దుండగులతో పాటు తిరుపతిని అరెస్ట్ చేయాలని కుటుంబసభ్యులు పీఎస్ ముందు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించారు.  కాగా, దాడి చేసిన ఇద్దరు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరి కొంతమంది పారిపోయారు. సీఐ రాణా ప్రతాప్ కేసు నమోదు చేశారు.