టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు పెట్టి రాజకీయం చేసిన్రు

టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు పెట్టి రాజకీయం చేసిన్రు

సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయన్న ఆయన... నిమజ్జన కార్యక్రమాల్లో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ సిబ్బందికి, జీహెచ్ఎంసీ సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్సవ సమితి వేడుకలకు మాత్రమే అస్సాం సీఎం ను స్వాగతించామని, ఎలాంటి రాజకీయాలతో ఉత్సవ సమితికి సంబంధం లేదని స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జనం రోజు ఏర్పాటు చేసిన స్వాగత వేదికలు తామే  ఏర్పాటు చేశామన్నారు. తమ వేదిక పైకి వచ్చిన స్థానిక టీఆర్ఎస్ నాయకుడు ప్రోగ్రాంను డిస్టర్బ్ చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నాయకులు  ఫ్లెక్సీలు పెట్టి రాజకీయం చేశారన్నారు.

 మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ ప్రభుత్వమే స్వాగత వేదికను ఏర్పాటు చేశామని చెప్తున్నారు.. కానీ అది సరికాదని భగవంత్ రావు అన్నారు. చాలా ఏళ్లుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలోనే ఈ స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాను ఎలాంటి విభేదాలు సృష్టించే మాటలు మాట్లాడలేదన్న ఆయన.... మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఈ అలజడికి కారకులుగా అనుమానిస్తున్నామని చెప్పారు. తనపై మూడురోజుల తరువాత కేసు నమోదు చేశారన్నారు. చార్మినార్ వద్ద తాము ఏర్పాటు చేసిన స్వాగత వేదికపైకి అస్సాం సీఎం రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారని ఈ సందర్భంగా భగవంతరావు ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించలేదని విమర్శించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన స్వాగత వేదికలను అడ్డుకోవాలని మంత్రి తలసాని కుట్ర పన్నారని... మంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని, దీన్ని వెంటనే సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు.