బీజేపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది

బీజేపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది

సంగారెడ్డి: బీజేపీ నేతల్లో రోజురోజుకూ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. పఠాన్ చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు. టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం కోల్పోవద్దన్నారు.

‘ఈ రోజు పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు చేసిన ధర్నా ఒక డ్రామా. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా ఢిల్లీ నేతలను తీసుకొచ్చి ప్రచారం చేయించినా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర బీజేపీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. ప్రజలు వారిని నమ్మకపోవడంతో సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఫేక్ వార్తల ప్రచారంలో నోబెల్ బహుమతి ఉంటే అది బీజేపీ పార్టీకే వస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం ఎన్నికల రోజున టీవీ9 లోగో వాడుకొని ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూశారు’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.

‘రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రధాన చానెల్స్ లోగోలు వాడుకుని టీఆర్ఎస్ ప్రముఖ నేతలు బీజేపీలో చేరుతారని ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు యత్నిస్తోందని మాకు సమాచారం అందింది. సోషల్ మీడియాను పూర్తిస్థాయి ఫేక్ మీడియాగా బీజేపీ మార్చేసింది. నాతో సహా ఇతర ముఖ్య నేతలపై తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దయచేసి ప్రజలు అలాంటి అసత్య వార్తలను నమ్మొద్దు. వీటిని ప్రచారం చేయొద్దు’ అని హరీశ్ రావు వివరించారు.