
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయింది.. నా వల్లే ఆగిపోయింది అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి. రెండు దేశాలు ఓ నాలుగు గంటలు ప్రశాంతంగా ఉన్నాయి. యుద్ధం ముగిసింది అంటూ జనం ఊపిరిపీల్చుకున్నారు. అంతా సద్దుమణిగింది అనుకున్న టైంలో.. మళ్లీ యుద్ధం మొదలైంది.
ఇరాన్ దేశం నుంచి భారీ స్థాయిలో మిస్సైల్ దాడులు జరిగాయని.. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో దాడులను గుర్తించినట్లు రక్షణ మంత్రి కాట్జ్ వెల్లడించారు. ఉత్తర భూభాగంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని.. కాల్పుల విరమణ తర్వాత.. ఇరాన్ దేశం నుంచే మొదట మిస్సైల్స్ దాడులు జరిగాయని చెబుతున్నారాయన. ఇరాన్ కాల్పుల విరమణను బ్రేక్ చేసిందుకు తీవ్రంగా స్పందించాలంటూ ఆర్మీ ఆదేశించారు కాట్జ్. ఇరాన్ దాడులకు తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్.. టెహ్రాన్ సిటీని టార్గెట్ చేయాలని నిర్ణయించింది. టెహ్రాన్ నగరంలోని ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల లక్ష్యంగా దాడులకు చేయనున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి స్మోట్రిచ్ కూడా స్పందించారు. ఇరాన్ నుంచి వచ్చిన మిస్సైల్స్ ను గుర్తించాం.. ఇక ఇప్పుడు టెహ్రాన్ షేక్ అవుతుంది అంటూ కామెంట్ చేశారు.
ఇజ్రాయెల్ దేశం నుంచి వస్తున్న వార్నింగ్స్, దాడులపై ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ దేశం ఆరోపిస్తున్నట్లు.. చెబుతున్నట్లు ఇరాన్ నుంచి ఎలాంటి మిస్సైల్స్ దాడి జరగలేదని ఆ దేశ మీడియా ప్రకటించింది. కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ దేశంపై ఎలాంటి సైనిక చర్య చేపట్టలేదని ఇరాన్ టీవీ IRIB ప్రకటించింది.
ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మాటలను కొట్టిపారేస్తుంది. రెండు బాలిస్టిక్ మిస్సైల్స్ తో ఎటాక్ చేశారని.. సైన్యం కూడా గుర్తించిందని.. ఇరాన్ దేశం నుంచే వచ్చాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి ఇద్దరూ ప్రకటించటం విశేషం.