ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి జరిగింది మొదలు.. అమెరికా, చైనాల మధ్య వాతావరణం ఢీ అంటే ఢీ అన్నట్లు హోరాహోరీ సాగుతోంది. చైనా – అమెరికా మధ్య చైనీస్ ఎయిర్ లైన్స్ సంస్థల విమాన సర్వీసులను నిషేధించాలని వైట్ హౌస్ యంత్రాంగం నిర్ణయం తీసుంది. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను చైనా ఉల్లంఘించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ చెబుతోంది.
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే తయారయిందని, వైరస్ వ్యాప్తి గురించి ప్రపంచాన్ని ఆ దేశం అప్రమత్తం చేయలేదని మొదటి నుంచి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే ఆయన ఆరోపణలను చైనా అవాస్తవమని చెబుతూ వస్తోంది. కానీ, కరోనా పుట్టిన చైనాలో వైరస్ వ్యాప్తి కంట్రోల్ లో ఉండడం, మరణాలు కూడా తక్కువగా ఉండడంతో పలు జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు.. డ్రాగన్ కంట్రీపై అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో అసలు వైరస్ కు మూలం ఏంటో తెలుసుకునేందుకు దర్యాప్తుకు ఒప్పుకోవాలంటూ అమెరికా గతంలో డిమాండ్ చేసింది. కానీ అందుకు చైనా ఒప్పుకోలేదు. ఒకానొక సందర్భంగా చైనా నిజాలు బయటపెట్టకుంటే భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పుడు ఈ హీట్ వాతావరణం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.
చైనాకు విమాన రాకపోకలను నిషేధిస్తూ ట్రంప్ అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. జూన్ 16 నుంచి చైనాకు చెందిన నాలుగు ఎయిర్ లైన్స్ సంస్థల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్. చైనా తన దేశంలోకి యునైటెడ్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులను పునరుద్దరించకపోవడంతోనే ఈ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే తమ దేశానికి చెందిన ఎయిర్ లైన్స్ సంస్థలను చైనా అనుమతించేలా చైనా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ప్రకటించింది.అయితే జూన్ 16 లోపు చైనా నుంచి సానుకూల స్పందన రాకుంటే తమ నిర్ణయం అమలు చేస్తామని తెలిపింది.