అలా చేస్తే AI ని బీట్ చేయవచ్చు.. టెకీలకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల సూచనలు

అలా చేస్తే AI ని బీట్ చేయవచ్చు..  టెకీలకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల సూచనలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాఫ్ట్ వేర్ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తోంది. ఉద్యోగులు చేసే పనిని సగం ఏఐ చేస్తుండటం టెక్ ప్రొఫెషనల్స్ లో ఆందోళన కలిగించే అంశం. ఏఐ రాకతో ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు లేఆఫ్స్ ను ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో ఏఐతో పోటీపడుతూ ఉద్యోగాలను కాపాడుకోవడం ఎలా అనే ప్రశ్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో మొదలైంది. అదే క్రమంలో ఏఐ ని తట్టుకుని సాఫ్ట్ వేర్ రంగంలో నిలదొక్కుకోవడం ఎలా అనే ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. 

ఈ పరిస్థితుల్లో కంప్యూటర్ స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ కు కీలక సూచనలు చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని ఏఐ మార్చివేస్తున్న ఈ సమయంలో స్టూడెంట్స్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలని సూచించారు. 

కోడింగ్ విషయంలో ఏఐ రోల్ పెరుగుతున్నప్పటికీ.. లాజికల్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, సిస్టమేటిక్ సొల్యుషన్ డిజైన్ చేయడం వంటి అంశాలకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుందని నాదెళ్ల అన్నారు.  ఏఐ సక్సెస్ అంతా ఇన్స్ట్రక్షన్స్, ఇన్ పుట్ ఇవ్వడంపైనే ఆధారపడి ఉందని అన్నారు. సిస్టమ్ ఎలా ఆలోచిస్తుందో.. దాన్ని నడిపించే టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవాలని సూచించారు. 

యూట్యూబర్ సజ్జద్ ఖాడే పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సత్య నాదెళ్ల భవిష్యత్తులో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల సరళి గురించి చర్చించారు. ‘‘ఏఐ ప్రపంచంలో నేను ఒక బిగినర్ ను.. టెక్ రంగంలోకి రావాలనుకుంటున్నా.. మీ ముఖ్యమైన సలహా ఏంటో చెప్పగలరా..’’ అనే ప్రశ్నకు ఆయన ఈ విధంగా రిప్లై ఇచ్చారు. ‘‘ఒక వేళ మీరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయితే.. సాఫ్ట్ వేర్ కు సంబధించిన ఫండమెంటల్స్ పై పట్టు సాధిస్తే.. అదే సరిపోతుంది’’ అని అన్నారు. 

మైక్రోసాఫ్ట్ కు చెందిన కోడింగ్ ను దాదాపు 30 శాతం వరకు ఏఐ చేసిపెడుతుందని ఆ మధ్య ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ తో సమావేశం సందర్భంగా  సత్యనాదెళ్ల అన్నారు. దీనిపై స్పందిస్తూ.. 20 నుంచి 30 శాతం కోడింగ్ ఏఐ రాస్తుండవచ్చు.. కానీ మెజారిటీ వర్క్ అంతా సాఫ్ట్ వేర్ ద్వారానే జరుగుతుందని అన్నారు.