అమెరికాలో కూడా ఉచిత హామీలు.. రిపబ్లికన్స్ను గెలిపిస్తే ఒక్కో అమెరికన్కు 5 వేల డాలర్లు.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికాలో కూడా ఉచిత హామీలు.. రిపబ్లికన్స్ను గెలిపిస్తే ఒక్కో అమెరికన్కు 5 వేల డాలర్లు.. ట్రంప్ కీలక ప్రకటన

నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న క్రమంలో అమెరికా ప్రజలకు ట్రంప్ కీలక హామీ ఇచ్చారు. రిపబ్లికన్లకు మద్దతుగా నిలిస్తే అమెరికాలోని ప్రతి పౌరుడికి 5 వేల డాలర్ల డివిడెండ్ జారీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు.

ప్రతినిధుల సభను, అమెరికా సెనేట్ను.. రెండింటినీ రిపబ్లికన్లు గెలుచుకుంటే ఆర్థికంగా అమెరికాకు ఉన్న అపారమైన బలంతో ప్రతీ అమెరికా పౌరుడికి 5 వేల డాలర్ల డివిడెండ్ జారీ చేస్తానని డల్లాస్లో జరిగిన రిపబ్లికన్ సదస్సులో ట్రంప్ ప్రకటించడం గమనార్హం. అయితే.. ఈ డివిడెండ్పై ట్రంప్ ఒక షరతు విధించారు. ఈ డివిడెండ్ను తప్పనిసరిగా అమెరికాలో మాత్రమే ఖర్చు చేయాలని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్రంప్ ఇచ్చిన ఈ ఎన్నికల హామీని అమలు చేస్తే అమెరికాపై కనీసం ఒక ట్రిలియన్ డాలర్ల భారం పడుతుంది. ఆర్థికంగా, రాజకీయంగా ఆచరణ సాధ్యం కాని హామీగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 5 వేల డాలర్ల హామీ అయితే ఇచ్చారు గానీ.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అమెరికా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం. మన దేశం చాలా డబ్బు సంపాదిస్తోందని మాత్రమే అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా.. అమెరికా కూడా కంటికి కనబడని ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. పెరిగిన ధరలు, ఇరాన్‌పై ట్రంప్ చేస్తున్న యుద్ధంపై అమెరికా ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ కూడా 30 కంటే తక్కువకు పడిపోయాయని ఇటీవల ఒపీనియన్ పోల్స్ చెప్పుకొచ్చాయి. ఈ క్రమంలో.. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో డెమొక్రాట్లు ప్రతినిధుల సభను 230-205 ఓట్లతో, సెనేట్‌ను 51-49 ఓట్లతో గెలుచుకుంటారని డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ ఇప్పటికే అంచనా వేసింది.