- మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం
- దాదాపు 30 అంశాలపై చర్చించే అవకాశం
- ఆర్టీసీ పైనే ప్రధానంగా చర్చ జరిగే చాన్స్
- మున్సిపల్ ఎన్నికలపైనా చర్చించనున్న కేబినెట్
RTC ప్రధాన అజెండాగా ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే భేటీలో ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. వీటితో పాటు మున్సిపల్ ఎన్నికలపై సీఎం మంత్రులతో మాట్లాడే చాన్సుంది
ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. హైద్రాబాద్ బేగంపేట క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. దాదాపు 30 అంశాలతో ఏజెండా తయారైనా, ఇందులో ఆర్టీసీ పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఆర్టీసీ సమ్మె, బస్సు రూట్లను ప్రైవేట్ కు అప్పగించడం, మున్సిపల్ ఎన్నికలపై చర్చించనుంది మంత్రివర్గం. ఆర్టీసీని విభజనపై మంత్రులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. హైదరాబాద్ లో గ్రేటర్ ప్రజా రవాణ వ్యవస్థ, జిల్లాలు, కార్పొరేషన్ స్థాయిలో పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ, గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల బస్సు రూట్లను ప్రైవేట్ కు అప్పగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది.
ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. వీటి సంఖ్యను 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 20 శాతం రూట్లను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించాలని డిసైడైంది. ఈ నిర్ణయాలకు కేబినెట్ కు ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. ఆర్టీసీ దాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు కామెంట్స్ పై భేటీలో చర్చించే అవకాశముంది.
కేంద్రం చేసిన మోటార్ వెహికిల్ చట్టం 2019 ను రాష్ట్రంలో యథావిధిగా అమలు చేసేలా మంత్రివర్గం తీర్మానం చేయనున్నట్టు తెలుస్తుంది. గాంధీ 150 వ జయంతి సందర్భంగా 10 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష, భాషా పండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ లు, అన్ని జిల్లాల్లో, పోలీస్ కమిషనరేట్లలో ఫింగర్ ప్రింట్ అనాలసిస్ యూనిట్ల ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, పలు కోర్టుల్లో పోస్టుల మంజూరు, ఆర్ అండ్ బీ లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ వింట్ ను విలీనం చేయడం, సమాచార పౌర సంబంధాల శాఖలో 36 పోస్టుల మంజూరు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో కొత్త పోస్టులకు అనుమతి , రంగారెడ్డి జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు వంటి అంశాలు ఎజెండాలో ఉన్నాయి…. SPOT
గతంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జీలను నియమించే ఆనవాయితీ ఉంది. కొద్ది రోజుల క్రితం దీనికి సవరణలు చేసింది. దాన్ని రాష్ట్రంలో అమలు చేసేలా కేబినెట్ తీర్మానం చేస్తారని తెలుస్తుంది.