- ఏప్రిల్ 30 వరకు పబ్లిక్ ప్లేసుల్లో పండుగలు, ర్యాలీలు, మీటింగ్స్పై సర్కార్ నిషేధం
- ఇయ్యాల సాయంత్రం నుంచి ఎల్లుండి సాయంత్రం దాకా వైన్స్ బంద్: పోలీస్ శాఖ
హైదరాబాద్, వెలుగు: కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు పబ్లిక్ ప్లేసుల్లో పండుగలు, ర్యాలీలు, ఊరేగింపులు, పబ్లిక్ గ్యాదరింగ్స్కు అనుమతి లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించింది. వివిధ మతాల వారు జరుపుకొనే షబ్ - ఏ బరాత్, హోలి, ఉగాది, శ్రీరామనవమి, మహవీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండుగలు ఏప్రిల్ 30లోపే ఉన్నాయని, ఆయా పండుగలతో పాటు సమావేశాలు, సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను పబ్లిక్ ప్లేసులు, గ్రౌండ్లు, పార్కుల్లో జరుపుకోవడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎల్లుండి దాకా వైన్స్ బంద్
హోలీ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఆదేశించింది. బైక్స్, కార్లలో రోడ్లపై తిరుగుతూ రంగులు చల్లే వారిపై యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్ గ్యాదరింగ్తో హోలీ ఈవెంట్స్ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. గ్రేటర్తో పాటు అన్ని జిల్లాల్లోని సీపీలు, ఎస్పీలు హోలీ వేడుకలపై సూచనలు, ఆంక్షలు వివరిస్తూ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు.