V6 News

టీఎస్‌‌పీఎస్సీ కేసు..సిట్‌‌ కస్టడీలో డీఏఓ, ఏఈ ఎగ్జామ్ టాపర్స్

టీఎస్‌‌పీఎస్సీ కేసు..సిట్‌‌ కస్టడీలో డీఏఓ, ఏఈ ఎగ్జామ్ టాపర్స్

హైదరాబాద్‌‌, వెలుగు: టీఎస్‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు నిందితులు రాజశేఖర్‌‌‌‌రెడ్డి భార్య సుచరిత, రేణుక వదిన శాంతి, ఫ్రెండ్‌‌ రాహుల్‌‌ను నాంపల్లి కోర్టు సిట్‌‌ కస్టడీకి అప్పగించింది.  ఈ మేరకు కోర్టు  మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ముగ్గురిని బుధవారం నుంచి శుక్రవారం వరకు అధికారులు విచారించనున్నారు.

చంచల్‌‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సుచరిత, శాంతి, రాహుల్‌‌ను సిట్ బుధవారం ఉదయం కస్టడీకి తీసుకోనుంది. వారికి మెడికల్ చెకప్ లు నిర్వహించి హిమాయత్‌‌నగర్‌‌‌‌లోని సిట్ ఆఫీస్‌‌కు తరలించనున్నారు. సుచరిత, శాంతి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్‌‌‌‌‌‌‌( డీఏఓ) పరీక్షలో టాప్ ర్యాంకర్స్‌‌గా నిలిచినట్లు సిట్ గుర్తించింది. వీరితో పాటు మహబూబ్‌‌నగర్‌‌‌‌కు చెందిన  రేణుక ఫ్రెండ్‌‌, టీచర్‌‌‌‌ రాహుల్‌‌ అసిస్టెంట్‌‌ఇంజినీర్‌‌‌‌(ఏఈ) పరీక్షలో టాప్ స్కోర్ చేసినట్లు ఆధారాలు లభించాయి. టీఎస్‌‌పీఎస్సీ డేటాబేస్, నిందితుల కాంటాక్ట్స్‌‌ ఆధారంగా ఈ ముగ్గురిని పోలీసులు గత బుధవారం అరెస్ట్ చేశారు.