గ్రూప్–1 పరీక్షకు బయోమెట్రిక్ అటెండెన్స్: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌

గ్రూప్–1 పరీక్షకు  బయోమెట్రిక్ అటెండెన్స్: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌

హైదరాబాద్: ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్–1 పరీక్షకు తొలిసారి బయోమెట్రిక్ అటెండెన్స్ ని అమలు చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గ్రూప్–1 పరీక్ష ఏర్పాట్ల గురించి ఆయన V6 తో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1019 సెంటర్లలో గ్రూప్–1 ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 16న ఉదయం10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. గంటన్నర ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 10:15 గంటల తర్వాత అభ్యర్థులను లోపలకి అనుమతించబోమని తెలిపారు. 

పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం

గ్రూప్–1 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌, టీఎస్‌పీఎస్సీ అధికారి సమక్షంలో ప్రశ్నపత్రం ఓపెన్‌ చేస్తామని,  దీన్ని మొత్తం వీడియో తీస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రూప్–1కి సంబంధించి ఇప్పటికే 2.87 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. మిగతావాళ్లు కూడా వీలైనంతా త్వరగా హాల్ టికెట్లు తీసుకోవాలని కోరారు. 

మూడు రోజుల్లో ప్రాథమిక ‘కీ’ రిలీజ్ చేస్తాం

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ముగిసిన మూడు రోజుల్లోగా ప్రాథమిక ‘కీ’ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 20లోపు ‘కీ’ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తామని,  ఆ తర్వాత నిపుణుల కమిటీ ఫైనల్‌ ‘కీ’ని ప్రకటిస్తుందని చెప్పారు.  గ్రూప్–1 పరీక్ష ఫలితాలను రెండు నెలల్లోగా రిలీజ్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారు. 

త్వరలోనే గ్రూప్‌-2, 4 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాం

త్వరలోనే  గ్రూప్ 2, 4  నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి చెప్పారు. గ్రూప్–1 పరీక్ష ముగిశాక మిగతా పరీక్షలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.