సంక్రాంతి పండగ కోసం ముందే ఏర్పాట్లు చేపట్టారు TSRTC అధికారులు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడిపించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న బస్సులతో పాటు పండగ కోసం ప్రత్యేకంగా 4,940 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 10 తేదీ నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
MGBS, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి పలు ప్రాంతాలకు సర్వీసులు నడుస్తాయన్నారు. పండగ కోసం వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కూడా ఉందని తెలిపారు. అంతేకాదు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని ప్రయాణికులను కోరారు ఆర్టీసీ అధికారులు.