తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా స్నపన తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా స్నపన తిరుమంజనం

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి.  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా  బుధవారం (సెప్టెంబర్ 20)న   శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయ్యప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.  ఆలయంలోని రంగనాయకుల మండపంలో వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవ చేశారు. దీనిలో భాగంగా రంగనాయకుల మండపాన్ని ఫలపుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ అంలకరణల్లో శ్రీవారు భక్తులను కనువిందు చేశారు.
 
ఇందులో భాగంగా అలంకార ప్రియుడిగా పూజలందుకుంటున్న తిరుమలేశుడికి ప్రకృతి దాసోహమైంది. సప్తగిరుల్లో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధమైన ఫలపుష్పాలనే కాకుండా దేశ, విదేశాల నుంచి ఫలపుష్పాదులను తెప్పించి స్వామివారిని అలంకరించారు అర్చకస్వాములు.  శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనుల‌ను చేసి వివిధ ర‌కాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, తామ‌ర‌ల‌తో వేదిక‌ను సుంద‌రంగా తీర్చిదిద్దారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం చేపట్టారు. ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి హోమాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు  పఠించారు. 

 
ఈసారి స్నపన తిరుమంజన సేవల్లో  పవిత్రమాలలతో దండలు, ఆకుపచ్చ పవిత్రమాలలతో దండలుప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.   ఇంకా పసుపురంగు పట్టుదారం దండలు, తామర గింజలు, తులసి గింజలతో దండలు, గోల్డ్ గ్రేప్స్ మాలలు, బాదం మాలలు, నందివర్ధనం, రోజ్ పెటల్స్, మల్టీకలర్ రోజ్ పెటల్స్ మాలలు, కిరీటాలు, తులసి దండలు  తయారు చేయించి, స్వామివారి తిరుమంజన సేవలో అలంకరించారు. టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్  శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు.  తమిళనాడులోని తిరుపూర్ కు చెందిన రాజేందర్ ఈ మాలలను విరాళంగా అందించారు.