తిరుమల భక్తులకు అలర్ట్​.... మారిన టీటీడీ వెబ్ సైట్​

తిరుమల భక్తులకు అలర్ట్​.... మారిన టీటీడీ వెబ్ సైట్​

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తన అధికారిక వెబ్ సైట్ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్ సైట్ పేరు tirupatibalaji.ap.gov.in అని ఉండేది. ఇప్పుడు దాన్ని ttdevasthanams.ap.gov.in అని మార్చింది. తిరుమల శ్రీవారి పుణ్యకేత్రానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. 'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్'‌లో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in ను ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్చామని తెలియజేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలా అధికారిక వెబ్‌సైట్‌ను మార్చింది. ఒకే సంస్థ.. ఒకే వెబ్‌సైట్.. ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో అధికారిక ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను మార్చినట్లు టీటీడీ వెల్లడించింది.ఇక నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని సూచించింది.

తిరుప‌తి, ఇత‌ర ప్రాంతాల్లో గ‌ల టీటీడీ ఆల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు విస్తృత ప్రాచుర్యం క‌ల్పించేదిశ‌గా అన్ని వివ‌రాల‌తో కొత్త  వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్  భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సోమవారం ( జనవరి 8) ఈ కార్యక్రమం జరిగింది

భక్తులు ఇకపై tirupatibalaji.ap.gov.in కాకుండా ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించాలన్నారు. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అయితే అప్పటికి అది టీటీడీ పేరిట స్వతంత్ర వెబ్ సైట్‌గా ఉండేది. ఆ తర్వాత టీటీడీ వెబ్ సైట్‌ను ప్రభుత్వానికి అనుబంధం చేస్తూ tirupatibalaji.ap.gov.in గా మార్చారు. ఇప్పుడు ఆ పేరును కూడా మార్చారు.

టీటీడీ పరిధిలోని  60కి పైగా స్థానికంగా  ఉన్న  ఆల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు సంబంధించి  స్థల‌పురాణం, ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన వేళ‌లు, రవాణా వివరాలు, ఇత‌ర సౌక‌ర్యాల‌ను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్‌ ను ఆధునీకరించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి,  వీరబ్రహ్మం, సివిఎస్ఓ  నరసింహ కిషోర్, డిఎల్వో శ్రీ వీర్రాజు, సిఈ  నాగేశ్వరరావు, ఐటి జనరల్ మేనేజర్ ఎల్ఎం.సందీప్ , తదితరులు పాల్గొన్నారు.