రేటింగ్ మాయాజాలంలో చానెళ్లు

రేటింగ్ మాయాజాలంలో చానెళ్లు

చానెళ్లకు యాడ్స్ కావాలంటే టీఆర్పీ కావాలి. టీఆర్పీ రావాలంటే జనం ఆదరించాలి. జనం చూడకపోయినా పర్లేదనుకుంటే అక్రమంగా రేటింగ్ తెచ్చుకోవాలి. దీనికి సర్కారు పవర్ తోడైతే… జనం ఆదరించే చానెల్ కు రేటింగ్ రాకుండా కూడా చేయెచ్చు. ఇప్పుడు మీడియా చానెళ్లలో కనిపిస్తున్న ట్రెండ్ ఇదే. చానెళ్లకు రేటింగ్ ఇచ్చే వ్యవస్థలోని లోపాలను వాడుకుంటూ ఇప్పటికీ అక్రమాలు కొనసాగుతున్నాయని మరోసారి బయటపడింది. అయితే జనం ఆదరణ ఉన్న చానెల్ అయినా కూడా ప్రభుత్వానికి నచ్చలేదన్న కారణంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న అనుమానాలూ ఉన్నాయి. అసలీ రేటింగ్ ఏంటి? అందులో లోపాలేంటి? దీనివల్ల పబ్లిక్ కు జరిగే నష్టమేంటి?

జనానికి న్యూస్ చెప్పే చానెళ్లే ఇప్పుడు వార్తల్లోకి వచ్చాయి. మనదేశంలో ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ చానెళ్లలో ఒకటైన రిపబ్లిక్ టీవీతో పాటు రెండు మరాఠీ చానెళ్లు టీఆర్పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్స్) కోసం అక్రమాలకు పాల్పడ్డాయంటూ ముంబై పోలీసులు కేసు పెట్టారు. టీవీలకు రేటింగ్ మీటర్లు ఉన్న కుటుంబాలకు పైసలిచ్చి డేటాను మానిప్యులేట్ చేస్తున్నారని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చెప్పారు. అయితే ఈ కేసుపై రిపబ్లిక్ టీవీ అధినేత ఆర్ణబ్ గోస్వామి మండిపడ్డారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో తమ కవరేజ్ నచ్చని మహారాష్ట్ర శివసేన సర్కారు కక్షసాధించడానికే తప్పుడు కేసు పెట్టించిందని ఆయన అన్నారు. దీనిపై లీగల్ గా పోరాటం చేస్తామని చెప్పారు. టీఆర్పీ కోసం అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం రిపబ్లిక్ కు లేదని ఆర్ణబ్ అంటున్నారు. ముంబై టీఆర్పీ కేసుతో రెండు అంశాలు తెరపైకి వచ్చాయి. ఒకటి, చానెళ్ల రేటింగ్ లో జరుగుతున్న అక్రమాలు. రెండోది, ప్రజాదరణ ఉన్న చానెళ్లపై ప్రభుత్వాలు కేసులు బనాయించడం.

ఏ ఇంట్లో మీటర్ ఉంది?

వేల కోట్ల విలువైన యాడ్ మార్కెట్ కోసం రేటింగ్ అక్రమాలు జరుగుతున్నట్లు చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణం వల్లే గతంలో ఉన్న ట్యామ్ రేటింగ్ సంస్థను పక్కనబెట్టి బార్క్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కూడా రేటింగ్ అక్రమాల ఆరోపణలు ఆగడం లేదు. టెక్నాలజీ పరంగా రేటింగ్ విధానం సెక్యూర్ అని చెబుతున్నా మీటర్ల నిర్వహణపైనే చాలా డౌట్స్ ఉన్నాయి. ఏ ఇంట్లో బార్క్ మీటర్ ఉందనే విషయం రహస్యమని అంటున్నా ఆ పరిస్థితి కనిపించట్లేదు. మీటర్లు ఉన్న ఇండ్ల సమాచారం తెలిసిన కొన్ని ఏజెన్సీలు కొన్ని చానెళ్ల నుంచి డబ్బు తీసుకొని డేటాను ట్యాంపర్ చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. మీటర్ ఉన్న కుటుంబానికి కొంత డబ్బు చెల్లించి, ఏ టైంలో ఏ చానెల్ పెట్టి ఉంచాలో చెబుతారు. ఇలాంటి అక్రమాలపై సరైన మానిటరింగ్ ఉండడం లేదు. ముంబై కేసులో మీటర్లను పర్యవేక్షించే ఏజెన్సీ ఉద్యోగులే నిందితులుగా ఉన్నారు. రేటింగ్ ఆధారంగానే కంపెనీలు ప్రకటనలిస్తున్నాయి. దీంతో అక్రమ రేటింగ్ వల్ల కంపెనీలు, నిజమైన పాపులర్ చానళ్లు నష్టపోతున్నాయి. ఇలాంటివి అక్కడక్కడా గుర్తించి బార్క్ కేసులు నమోదు చేస్తున్నా ఇది ఆగడం లేదు. రాష్ట్రంలో రెండేళ్ల కింద హుజూరాబాద్ లో బార్క్ మీటర్లను మాయం చేసిన కేసు నమోదైంది. ఆ మీటర్లు ఎక్కడున్నాయో తెలియకుండానే వాటి నుంచి డేటా అందుతున్నట్లు గుర్తించడం విశేషం. అలాగే గత ఏడాది డిసెంబర్‌లో మీటర్ల మానిప్యులేషన్ చేస్తున్న ఏడుగురిపై హైదరాబాద్ పోలీసులు కేసు పెట్టారు.

జనం ఆదరణే అసలు పాయింట్

కోట్లాది మంది చూసే చానెళ్ల పాపులారిటీని కేవలం కొన్ని వందల మీటర్ల ఆధారంగా నిర్ణయించడం సైంటిఫిక్ కాదన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. మీటర్లున్న కొన్ని ఇండ్లను మేనేజ్ చేస్తే చాలు జనం చూడకున్నా ఫర్వాలేదనుకునే ధోరణి కనిపిస్తోంది. ఇది న్యూస్ మీడియాలో క్వాలిటీ దెబ్బతీయడంతో పాటు యాడ్ మార్కెట్ లక్ష్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉంది. చానెళ్ల ప్రకటనలకు రేటింగే ఆధారం కావడంతో ఇది అనారోగ్యకరమైన పోటీకి దారితీసింది. ఎంటర్ టెయిన్ మెంట్ తో పోలిస్తే వార్తల చానెళ్లలో ఇది మరీ ఎక్కువగా ఉంది. యాడ్లలో ఎంటర్ టెయిన్ మెంట్, స్పోర్ట్స్ చానెళ్ల వాటా ఎక్కువగా ఉంటే చానెళ్ల సంఖ్య తక్కువగా ఉంది. న్యూస్ కు యాడ్స్ షేర్ తక్కువగా ఉంటే చానెళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ చానెళ్లకు రేటింగ్ తప్ప వేరే ఆధారం లేదు. అయితే ప్రాంతీయ భాషల చానెళ్లకు లోకల్ మార్కెట్ ఉంటుంది. చానెళ్ల కథనాలకు ప్రజల్లో వచ్చే స్పందనను బట్టి లోకల్ మార్కెట్లో వాటికి విలువ ఉంటుంది. జనం ఆదరణ ఉన్న చానెళ్లు రేటింగ్ లెక్కలతో సంబంధం లేకుండా పనిచేస్తుంటాయి.

ప్రజలకు వార్తలు అందేదెట్ల?

నిజమైన వ్యూయర్ షిప్ తో సంబంధం లేకుండా వచ్చే తప్పుడు రేటింగ్ వల్ల ఎక్కువగా నష్టపోయేది మన జనం, సమాజమే. అక్రమ మార్గాల్లో రేటింగ్ వస్తుండడం వల్ల చానెల్‌లో వచ్చే వార్తలపై ఎలాంటి బాధ్యత, నియంత్రణ ఉండదు. సెన్సేషనల్ చేయడానికి కేవలం క్రైమ్, సినిమా గాసిప్స్, వ్యక్తుల బలహీనతలు, వ్యక్తిగత జీవితాలు, సెంటిమెంట్లను రెచ్చగొట్టే అంశాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటికే అక్రమంగా రేటింగ్ లు రావడం వల్ల మిగతా చానెల్స్ కూడా అలాంటి కథనాలనే ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. జనాన్ని భయపెట్టేలా, తప్పుదోవ పట్టించేలా, మూఢనమ్మకాలు పెంచేలా కథనాలు ఉంటాయి. దీంతో ప్రజలకు అందాల్సిన నిజమైన సమాచారం, వార్తలు అందకుండా పోతాయి. జనం సమస్యలతో పాటు వారికి ఏం కావాలన్నది తెలుసుకునే ప్రయత్నం జరగదు. ఓవైపు సోషల్ మీడియాలో విపరీతంగా తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవుతున్న పరిస్థితిలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ అదే ధోరణి ఉండడం సమాజానికి ప్రమాదకరం అంటున్నారు సామాజికవేత్తలు. జనం ఆదరించే చానెళ్లకే సరైన రేటింగ్ వచ్చే వ్యవస్థ ఉన్నప్పుడే న్యూస్ విషయంలో బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల దేశ వ్యాప్తంగా రేటింగ్ విధానం మెరుగుపడడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి.

సర్కారు వారి రేటింగ్

ముంబై రేటింగ్ వివాదంలో మరో వాదన బలంగా వినిపిస్తోంది. రిపబ్లిక్ చానెల్ ఇంగ్లిష్ న్యూస్ కేటగిరీలో మొదటి నుంచీ ముందుంది. ఆర్ణబ్ గోస్వామి డిబేట్లకు ప్రత్యేకంగా వ్యూయర్ షిప్ ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసుపై రిపబ్లిక్ పూర్తిస్థాయిలో కవరేజ్ చేస్తోంది. ముంబై పోలీసుల తీరును ప్రశ్నించింది. కేసును మహారాష్ట్రలో శివసేన సర్కారు అడ్డుకుంటోందన్న వాదన తెరపైకి తెచ్చింది. అందుకే ప్రభుత్వం కక్షగట్టిందనే వాదనను ఆర్ణబ్ వినిపిస్తున్నారు. దీనికి బలాన్నిచ్చే పరిస్థితి చాలాచోట్ల ఉంది. సర్కారుకు అనుకూలంగా లేకపోతే చానళ్లను వేధించి, ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నాలు చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వాలు రూల్స్ ప్రకారం ఇవ్వాల్సిన యాడ్స్ ను నిలిపేసి ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయి. నచ్చని మీడియాలను దెబ్బతీయడానికి అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు. రేటింగ్ ను దెబ్బతీయడానికి ఏజెన్సీలను, వ్యక్తులను పెట్టి మేనేజ్ చేస్తున్నారు. ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తుల చేతుల్లో ఉన్న చానెళ్లకు రేటింగ్ పెంచుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలున్నాయి.

రేటింగ్ మీదే 78 వేల కోట్ల మార్కెట్

మనదేశంలో టీవీ, ఎంటర్ టెయిన్ మెంట్ ప్రకటనల మార్కెట్ విలువ రూ.78వేల 700 కోట్లు (2019 ఫిక్కీ-ఈవై రిపోర్ట్). ఇన్ని కోట్ల ప్రకటనలు ఇవ్వడానికి టీవీ రేటింగ్ లే ఆధారం. మనదేశంలో బార్క్ (BARC–-బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) సంస్థ టీవీ రేటింగ్ లు ఇస్తోంది. ఇది దేశంలో ర్యాండమ్ గా ఎంపిక చేసిన ఇండ్లల్లో టీవీలకు మీటర్లు పెట్టి వ్యూయర్ షిప్ డేటా తీసుకుంటోంది. కొన్ని ప్రైవేటు ఏజెన్సీల ద్వారా రేటింగ్ మీటర్లు నిర్వహిస్తోంది. అర్బన్, రూరల్ ప్రాంతాల వారీగా, కుటుంబ సభ్యుల సంఖ్య, సామాజిక, ఆర్థిక పరిస్థితి ఆధారంగా డేటా తీస్తున్నట్లు బార్క్ చెబుతోంది. మీటర్లు పెట్టిన కుటుంబాల్లో వారికి ఐడీలు ఇచ్చి, వాళ్లు చూసే చానెల్, టైం రికార్డు చేస్తున్నారు. ఇట్లా 600కు పైగా చానెళ్లకు రేటింగ్ అందిస్తోంది. దేశంలో 83.6 కోట్ల మంది టీవీ ప్రేక్షకులు ఉంటే ఏ చానెల్ ను ఎంతమంది, ఎంతసేపు చూస్తున్నారో కచ్చితంగా అంచనా వేయడం కష్టం. బార్క్ సంస్థ 45 వేలకు పైగా ఇండ్లలో పెట్టిన మీటర్ల డేటా ఆధారంగా వీక్లీ రేటింగ్ ఇస్తోంది.

టీఆర్పీ జర్నలిజం బందుపెట్టాలి

‘‘మొదట్లో ఎల్లో జర్నలిజం ఉండేది. కొన్నేళ్ల కింద పెయిడ్ జర్నలిజం వచ్చింది. తర్వాతఫేక్ జర్నలిజం వచ్చింది. ఇప్పుడు టీఆర్పీ జర్నలిజంగా మారింది. ఒకప్పడు ట్యామ్అనే సంస్థ ఉండేది. దేశంలో కోట్లాది టీవీలుంటే వాళ్లు 5 వేల మీటర్లు పెట్టి అదే రేటింగ్ అనేవాళ్లు. నేను మంత్రి అయ్యాక బార్క్ సంస్థ వస్తుంటే  సెల్ఫ్ రెగ్యులేషన్ బాగుంటుందని ఆహ్వానించాం. ఇప్పుడూ అట్లాగే ఫిర్యాదులొస్తున్నాయి. టీఆర్పీజర్నలిజం వల్ల ఏం జరుగుతోందో రెండునెలలుగా కనిపిస్తూనే ఉంది. టీఆర్పీ కోసం హడావుడి చేసే తీరును ఇప్పటికైనా మీడియా బందుపెట్టాలి’’

– ప్రకాశ్ జవదేకర్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రి

రేటింగ్ అక్రమాలు ఆగేదెట్ల?

  1. రేటింగ్ టెక్నాలజీ ఎంత గొప్పగా నేరుగా మీటర్లు ఉన్న ఇంట్లోనే పైసలిచ్చి మేనేజ్ చేయడం కంపెనీలను కూడా ఆలోచనలో పడేస్తోంది. అందుకే రేటింగ్ ఆధారంగా కాకుండా సొంత పరిశీలనతో నిజంగా ఆదరణ ఉన్న చానెళ్లకే యాడ్స్ ఇస్తామని బజాజ్ ఆటో కంపెనీ ప్రకటించింది. రేటింగ్ విశ్లేషణ, డేటా సెక్యూరిటీ విషయంలో బార్క్ లో మరిన్ని మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి గుర్తుచేస్తోంది. రావాల్సిన మార్పులు ఏమిటంటే…
  2. మీటర్లు ఉన్న ఇండ్ల వివరాలు రహస్యంగా లేవన్నది చాలాసార్లు బయటపడింది. ర్యాండమ్ గా మీటర్లు మార్చే ఇండ్ల వివరాల గోప్యతపై బార్క్ దృష్టిపెట్టాలి.
  3. మీటర్లు పెట్టే కుటుంబాలు కాస్త పైసల కోసం డేటా మానిప్యులేషన్ కు ఒప్పుకునే పరిస్థితి ఉండకూడదు.
  4. మీటర్ల ఆధారంగానే కాకుండా చానెళ్ల నిజమైన ఆదరణను పరిశీలించేందుకు సమాంతరంగా మరో విశ్లేషణ జరగాలి.
  5. డీటీహెచ్ కనెక్షన్లు ఉన్న ఇండ్లలో వ్యూయర్ షిప్ డేటాను రేటింగ్ విశ్లేషణకు ఉపయోగించుకోవాలి. వ్యక్తుల ప్రమేయం వీలైనంత తక్కువగా ఉండేలా రేటింగ్ డేటా సేకరణ నుంచి విశ్లేషణ వరకు ప్రాసెస్ జరగాలి.
  6. డిజిటల్ సెట్ టాప్ బాక్స్ ల ఆధారంగా నేరుగా డేటాను తీసుకునే టెక్నాలజీని ఉపయోగించాలి. పైసలిచ్చే మేనేజ్ చేసేందుకు అవకాశం లేనంత ఎక్కువగా శాంపిల్ కలెక్షన్ జరగాలి.
  7. టీవీతో పాటు వెబ్ సైట్, యూట్యూబ్, యాప్, సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా చానెళ్లు జనానికి దగ్గరవుతున్నాయి. ఇలాంటి మల్టిపుల్ ప్లాట్ ఫాంలపై ఆర్గానిక్ ఫాలోయర్స్, ఎంగేజ్ మెంట్ ఆధారంగా ఆదరణను అంచనా వేసే అవకాశం ఉంది.
  8. కొన్ని వేల మీటర్ల ఆధారంగా కోట్ల మంది ప్రేక్షకుల ఆదరణను అంచనా వేయడం సరికాదు. అమెరికా లాంటి దేశాల్లో ప్రతి ప్రోగ్రామ్‌ను కచ్చితంగా ఎంతమంది చూశారో అంచనా వేసే విధానం ఉంది. అలాంటి వాటిని మన దగ్గర అమలుచేయాలి. రేటింగ్ విధానం బలంగా ఉంటే జనం ఆదరించే చానెళ్లకు, యాడ్ మార్కెట్ కు మేలు జరుగుతుంది. కోట్ల మంది జనానికి నాణ్యమైన ప్రసారాలు అందించే అవకాశం ఉంటుంది.

రేటింగ్ లోపాల వల్లే ట్యామ్ ఫెయిల్
మనదేశంలో మొదట్లో టీవీ రేటింగ్స్ ఇవ్వడానికి ట్యామ్ అనే సంస్థ పనిచేసేది. దీన్ని ప్రముఖ సర్వే సంస్థ ఏసీ నీల్సన్-కాంటార్ మీడియా కలిసి ఏర్పాటు చేశాయి. చాలా తక్కువ శాంపిల్స్ తో రేటింగ్ ఇవ్వడం, మీటర్లకు సెక్యూరిటీలే కపోవడం, మీటర్ల డేటాను ట్యాంపర్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ట్యామ్ ప్రతిష్ఠ దెబ్బతింది. ఇదే టైంలో టీవీ బ్రాడ్ కాస్టర్లు, అడ్వర్టయిజర్లు,ఏజెన్సీలు చేతులు కలిపి బార్క్ సంస్థలు ఏర్పాటు చేశారు. శాంపి ల్ మీటర్లను పెంచడం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీటర్లు, ట్యాంపర్ కు అవకాశం లేని సెక్యూరిటీ అందిస్తామన్న హామీతో 2015 నుం చి బార్క్ పనిచేస్తోంది. చానెళ్లకు ఆడియో వాటర్ మార్కింగ్ ఇచ్చి, దాని రీడింగ్ ఆధారంగా రేటింగ్ ఇస్తున్నామని బార్క్ చెబుతోంది. ఇది ట్యాంపర్ కు అవకాశం లేదని అంటోంది. అయితే మీటర్ల నిర్వహణపై అనుమానాలు పెరుగుతున్న టైంలో బార్క్ సంస్కరణలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

– కె.మురళీకృష్ణ,
అవుట్ పుట్ ఎడిటర్, వీ6 న్యూస్