కేటీఆర్, డీకే శివకుమార్ మధ్య ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్

కేటీఆర్, డీకే శివకుమార్ మధ్య ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌, క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ ఆసక్తికర చాలెంజ్ చేసుకున్నారు. బెంగుళూరులో మౌళిక స‌దుపాయాలు స‌రిగా లేవ‌ని కొన్ని రోజుల కిందట ఖాతాబుక్ సీఈవో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో కామెంట్ చేశారు. దానికి మంత్రి కేటీఆర్ బదులిస్తూ.. మీరంతా హైద‌రాబాద్‌కు రావొచ్చు అని, ఇక్క‌డ ఉత్త‌మ స‌దుపాయాలున్న‌ట్లు ట్వీట్ చేశారు. ఇన్నోవేష‌న్‌, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, ఇంక్లూజివ్ గ్రోత్‌పై త‌మ ప్ర‌భుత్వం దృష్టి పెట్టిన‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. ఆ ట్వీట్‌కు ఇవాళ క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ కౌంట‌ర్ ఇచ్చారు. ‘మీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా. 2023 లో క‌ర్నాట‌క‌లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంది. మా హయాంలో బెంగుళూరుకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం.’ అని బదులిచ్చారు. 

అయితే కేటీఆర్ కూడా వెంటనే తన సమాధానం ఇచ్చారు. ‘శివ‌కుమార్ అన్నా.. క‌ర్నాట‌క రాజ‌కీయాల గురించి నాకు అంత‌గా తెలియ‌దు. అక్క‌డ ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేను. కానీ మీరు విసిరిన స‌వాల్‌ను స్వీక‌రిస్తున్న‌ా’ అంటూ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దేశ యువ‌త, సౌభాగ్యం కోసం ఉద్యోగాల క‌ల్ప‌న ద్వారా హైద‌రాబాద్‌, బెంగుళూరు న‌గ‌రాల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండాల‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఐటీ, బీటీల‌పై ఫోక‌స్ పెడుదామ‌ని, కానీ హ‌లాల్‌, హిజాబ్ లాంటి అంశాల‌పై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.