స్కూటీలో పిల్లలను ముందు వైపు నిల్చోబెట్టుకుంటున్నారా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

స్కూటీలో పిల్లలను ముందు వైపు నిల్చోబెట్టుకుంటున్నారా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

బెంగళూరు: బెంగళూరులో ఘోరం జరిగింది. రోజూలానే మంగళవారం ఉదయం కూడా పిల్లలను పిక్ చేసుకోవడానికి వస్తున్న స్కూల్ బస్ ఇద్దరు చిన్నారుల ప్రాణాలను చిదిమేసింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు ముద్దులొలికే చిన్నారుల ప్రాణం తీసింది. బెంగళూరులోని హెన్నూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. 

తనిసంద్ర పోలీస్ క్వార్టర్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ యాక్సిడెంట్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగన్న గౌడ అనే కానిస్టేబుల్ ఉదయాన్నే పాలు కొనుక్కుని రావడానికి తన రెండేళ్ల కూతురు వర్ష.. తన నాలుగేళ్ల వయసున్న మేనకోడలు భానును స్కూటీపై ఎక్కించుకుని షాప్కు వెళుతున్నాడు. ఇద్దరు చిన్నారులను స్కూటీ ఫ్లోర్ బోర్డ్ (ముందు భాగంలో కాళ్లు పెట్టుకునే స్థలం) దగ్గర నిల్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు. 

ఒక మలుపు దగ్గర బస్ వస్తుండటాన్ని గమనించి స్కూటీ ఆపేశాడు. ఆ స్కూటీని గమనించని బస్ డ్రైవర్ అమాంతం స్కూటీ మీదకు బస్ పోనిచ్చేశాడు. ఈ దుర్ఘటనలో స్కూటీ ముందు భాగంలో నిల్చుని ఉన్న ఇద్దరు పిల్లలు కింద పడిపోయారు. బస్సు వెనుక చక్రాలు ఇద్దరి పై నుంచి వెళ్లడంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. 

హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నాగన్న గౌడ స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్కూల్ బస్ డ్రైవర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారులు యాక్సిడెంట్ స్పాట్ను పరిశీలించారు.