రాజ్యసభ ఎన్నికల వేళ.. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు‌ షాక్‌

రాజ్యసభ ఎన్నికల వేళ.. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు‌ షాక్‌
  • రాజీనామా చేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
  •  మార్చిలోనే ఐదుగురు రిజైన్‌

న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జిత్తు చౌదురి, అక్షయ్‌ పటేల్‌లు తమ పదువులకు రాజీనామా చేయగా.. అసెంబ్లీ స్పీకర్‌‌ రాజేంద్ర త్రివేది ఆమోదించారు. మార్చిలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. ఇప్పుడు వీరితో కలిపి మొత్తం సంఖ్య ఏడుకు చేరింది. మొత్తం 182 మంది ఎమ్మెల్యేలు ఉన్న గుజరాత్‌ శాసనసభలో 103 మంది బీజేపీ ఎమ్మెల్యేలు. ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రూలింగ్‌ బీజేపీ ముగ్గురు సభ్యులను బరిలోకి దించింది. గుజరాత్‌లో ఒక్కో కేండిడేట్‌కు కనీసం 34 ఎమ్మెల్యేల సపోర్ట్‌ ఉండాలి. కాగా.. ఇప్పుడు కాంగ్రెస్‌ బలం 66కు చేరుకుంది. దీంతో కాంగ్రెస్‌ రెండో సీటు గెలవడం కష్టంగా మారింది. ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ షాప్‌ ఓపన్‌ చేసిందని, డబ్బుతో అధికారం కొంటోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ సీట్లకు మార్చి 26న ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా పోస్ట్‌పోన్‌ అయ్యాయి. వాటికి ఈ నెల 19న ఎలక్షన్స్‌ నిర్వహించనున్నారు.