రెండు నెలల్లో ఇద్దరు సూసైడ్ కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకిన డిగ్రీ స్టూడెంట్స్

రెండు నెలల్లో ఇద్దరు సూసైడ్ కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకిన డిగ్రీ స్టూడెంట్స్
  • మంచిర్యాల సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో భయం భయం 
  • విచారణకు ఆదేశించిన కలెక్టర్ 
  • ఎంక్వైరీ ఆఫీసర్​గా డీఏవో

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు స్టూడెంట్స్​ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు, మరోవైపు లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న భీమిని మండలం జగ్గయ్యపల్లికి చెందిన జంగపల్లి లక్ష్మీప్రసన్న(20) కాలేజీ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. డిగ్రీ సెకండియర్ చదువుతున్న ఆమె అంతకుముందు రోజు రాత్రి సెక్యూరిటీ గార్డు ఫోన్ నుంచి తన పెద్దమ్మ కొడుకుతో మాట్లాడింది. 

రాత్రి విద్యార్థులకు ఫోన్ ఎందుకు ఇస్తున్నారని అతడు సెక్యూరిటీ గార్డును మందలించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతోనే ఆమె సూసైడ్ చేసుకుందని విచారణలో తేలినట్లు సమాచారం. తాజాగా బీజెడ్​సీ సెకండియర్ చదువుతున్న కుమ్మరి స్వప్న(20) ఈ నెల 25న కాలేజీ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హైదరాబాద్ నిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. 

ఆమె డెడ్ బాడీని కుటుంబసభ్యులు తమ స్వగ్రామమైన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మర్తిడికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి బంధువులు కాలేజీ వద్ద ఆందోళన చేస్తారన్న సమాచారంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  డెడ్ బాడీని తీసుకువస్తున్న అంబులెన్స్ ను హైదరాబాద్ నుంచి ఫాలో చేసి, శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ దగ్గర నుంచి నేషనల్ హైవే 363 మీదుగా స్వగ్రామానికి పంపించారు.  

కారణాలు ఏమిటో?

స్వప్న ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. చిన్నప్పటినుంచి చదువులో ముందుండే ఆమె కాలేజీలో కూడా బాగా చదివేదని లెక్చరర్లు, తోటి విద్యార్థులు తెలిపారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేదని, తోటి విద్యార్థులతో కూడా సరిగా మాట్లాడేది కాదని చెప్పారు. కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆత్మహత్య చేసుకోవాల్సినంత బలమైన కారణాలు ఏమిటో తెలియడం లేదని కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

విచారణకు ఆదేశం..

వరుస ఘటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందున్నారు. దీంతో కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ కల్పనను విచారణకు ఆదేశించారు. స్వప్న ఆత్మహత్యకు గల కారణాలపై ఎంక్వైరీ చేసి, ఐదు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం కాలేజీకి వెళ్లి, విచారణ ప్రారంభించారు. లెక్చరర్లు, స్టూడెంట్లను ఆరా తీశారు. కాలేజీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, భద్రతా లోపాలు కూడా కనిపించలేదని తెలిసింది. ఆమె ఇంటర్ వరకు ఎక్కడ చదివింది, అక్కడ ఆమె ప్రవర్తన ఎలా ఉండేది, కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా తదితర కోణాల్లో విచారణ జరపనున్నట్లు డీఏవో పేర్కొన్నారు.