ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్

ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్

చెన్నై: డీఎంకే కీలక నేత, తమిళనాడు అపొజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్‎ అరెస్ట్ అయ్యారు. సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు ఆయనను మంగళవారం (ఆగస్ట్ 4) అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‎కు తరలించారు. దీంతో ఉదయనిధి స్టాలిన్ నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్‎ను నిరసిస్తూ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, డీఎంకే శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టి పోలీసులు ఆయనను తరలించారు. 

అసలేం జరిగిందంటే..?

కావేరి జలాల అంశంపై తంజావూరులో సోమవారం (ఆగస్ట్ 3) డీఎంకే నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అగ్రనేత ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ ప్రభుత్వ అసమర్థతతో తమిళనాడుకు చుక్క కావేరి నీళ్లు రావడం లేదని నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తుండగా కొందరు త్రిష.. త్రిష అని నినాదాలు చేస్తూ ఆయన స్పీచ్‎కు అడ్డుతగిలారు. దీంతో నవ్వుతూ ప్రసంగం ఆపిన ఉదయనిధి.. నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి చేరాలి’’ అని వ్యాఖ్యానించారు. 

అయితే, తాను కేవలం కావేరి జలాల గురించే మాట్లాడుతున్నానని వ్యంగ్యంగా అన్నారు. ఉదయనిధి పరోక్షంగా సీఎం విజయ్, త్రిషను ఉద్దేశించే అన్నాడని విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై అధికార టీవీకే పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఈ క్రమంలోనే ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే నేతలు తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టీవీకే నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు ఉదయనిధి స్టాలిన్ పై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

హైకోర్టును ఆశ్రయించిన ఉదయనిధి

సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు మంగళవారం (ఆగస్ట్ 4) కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‎ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. ఉదయనిధి స్టాలిన్ అభ్యర్థన మేరకు ఈ పిటిషన్‎ను అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. మంగళవారం (ఆగస్ట్ 4) మధ్యాహ్నం ఈ పిటిషన్‎పై విచారణ జరగనుంది. ఉదయనిధి అరెస్ట్ తో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.