ఉద్యోగ నోటిఫికేషన్ రాక నిరుద్యోగి ఆత్మహత్య

ఉద్యోగ నోటిఫికేషన్ రాక నిరుద్యోగి ఆత్మహత్య

ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్స్ రాకపోవడంతో వనపర్తి జిల్లా లో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల ఉపాధ్యాయ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఎదురు చూసి విసుగు చెందాడు గోపాల్ పేట మండలం తాడిపర్తి  గ్రామానికి చెందిన కొండల్. ఏండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్ రాకపోవడంతో  మనస్తాపంతో గురువారం సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  అమ్మా నాన్న మీరు నన్ను అపురూపంగా చూసుకున్నారు...నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుందామనుకున్నా.. కానీ ఏ ఉద్యోగం సాధించలేకపోయాను అంటూ సూసైడ్ నోట్ లో తెలిపాడు.

 నిరుద్యోగిగా సమాజంలో బతకలేక పోతున్నా, ప్రభుత్వం గురుకుల పాఠశాలలలో ఉపాధ్యాయ నోటిఫికేషన్ వస్తుందేమోనని ఎదురు చూసినా...కానీ ఎంతకూ రావడం లేదు. శారీరకంగా మానసికంగా బాగా దెబ్బతిన్నానంటూ  కొండల్  సూసైడ్ నోట్ రాశాడు. గురువారం ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో బంధువులు తలుపులు తీసి చూడగా అప్పటికే  చనిపోయి కన్పించాడు.

 తాటిపర్తి గ్రామానికి చెందిన  తోకల రాములు వెంకటమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమారుడు పదేళ్లక్రితం చనిపోయాడు.ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. తల్లిదండ్రులు హైదరాబాదులో కూలి పనులు చేసేవారు.. కొండల్ మాత్రం ఒక్కడే  స్వగ్రామంలో ఉంటూ ఎంకాం,  బీఈడీ చేశాడు. గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాన్ని తగ్గించాలనుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.