అబద్ధాలు ప్రచారం చేశారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

అబద్ధాలు ప్రచారం చేశారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
  • తప్పుదోవ పట్టించడంలో టీఆర్​ఎస్​ మాస్టర్స్ చేసింది

  • టీఆర్ఎస్ సర్కార్ తీరుతో రాష్ట్ర ఆదాయానికి గండి పడుతున్నది  

న్యూఢిల్లీ, వెలుగు: అభివృద్ధి, నిజమైన సమస్యల నుంచి రాష్ట్ర ప్రజల్ని పక్కదారి పట్టించే కళలో బీఆర్ఎస్(టీఆర్ఎస్) మాస్టర్స్ చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సీసీఎల్) ప్రైవేటైజేషన్ పై కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఎస్సీసీఎల్ లో 51 శాతం వాటా తెలంగాణ సర్కార్​దే అని గుర్తు చేశారు. అందువల్ల ఎస్ సీసీఎల్ ను ప్రైవేటైజేషన్​పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదని క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ కూడా చెప్పారన్నారు. అయితే, కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తోందని ఫైర్ అయ్యారు. బొగ్గు గనుల కేటాయింపు, పీఎస్ యూల ప్రైవేటైజేషన్ కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ‘బొగ్గు గనుల వేలానికి ప్రైవేటైజేషన్ కు సంబంధం లేదు. ఇందులో ప్రభుత్వ వాటా విక్రయం ఉండదు. గనుల వేలం పోటీ బిడ్ ల కోసం పారదర్శక వేదికను అందస్తోంది. ఇది దేశ అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ఆ బొగ్గు బ్లాకులను రాష్ట్ర సర్కార్ వినియోగించుకుంటలేదు.. 

గనుల వేలం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అని జోషి అన్నారు. అభివృద్ధికి దోహదపడేలా పోటీతత్వం పెంచేందుకు బిడ్ లను ఆహ్వానించినట్లు చెప్పారు. ఎలాంటి పరిమితులు లేకుండా ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు బిడ్ లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు వివరించారు. ఈ దిశలో వేలం ద్వారా గనుల కేటాయింపులు జరిపి తెలంగాణ ప్రభుత్వం తగిన ఆదాయం పొందవచ్చని మంత్రి వెల్లడించారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం వేలానికి విముఖత చూపిందన్నారు. దీంతో ఒక్క బ్లాక్ కూడా కేటాయించని కారణంగా రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిందని విమర్శించారు. గతంలో ఎస్ సీసీఎల్ కి నైని, పెనగడ్డప్ప, న్యూ పాత్రపర అనే మూడు బొగ్గు గనులు కేటాయించినట్లు గుర్తు చేశారు. అయితే, అవినీతిలో కూరుపోయిన తెలంగాణ సర్కార్ ఏడేండ్ల నుంచి ఈ బ్లాకులను వినియోగించలేకపోయిందని ఆరోపించారు. వేలాన్ని నిరాకరించడం వల్ల రాష్ట్రానికి రావల్సిన ఆదాయం గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రధాని మోడీ అభివృద్ధి, ఆదాయం కోసం బ్లాక్ లను వేలం వేసేందుకు రాష్ట్రాల తరఫున చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇది బాధ్యతాయుతమైన సుపరిపాలనకు సంకేతం అని ట్వీట్ చేశారు.