కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంలా మారింది

కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంలా మారింది

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గద్దెదిగితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. యాదగిరిగుట్టలో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన షెకావత్..సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందలు తెలిపారు. ఎంతో పవిత్ర స్థలమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బండి సంజయ్ పాదయాత్రను ప్రజలు ఆశీర్వదించారని..మూడవ విడత పాదయాత్ర కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

రాష్ట్రంలో బీజేపీ జంగ్ సైరన్ మోగించిందని..వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్న ఆయన.. ఇక్కడి ప్రజలు సుష్మా స్వరాజ్ను చిన్నమ్మగా పిలుచుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందని..కేసీఆర్ కుటుంబ పాలన అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలకు మాత్రమే కేసీఆర్ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అణగారిన వర్గాలంటే కేసీఆర్ కు గిట్టదన్నారు.

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్  కట్టారు

ఇంజనీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌస్లు మునిగాయన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్  కట్టారని..కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ గా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్... ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. 

అవినీతి పరులకు కేసీఆర్ అండగా నిలుస్తుండు

దేశాన్ని ఏళ్లుగా పాలించిన వాళ్లు ప్రజలను పట్టించుకోలేదని షెకావత్ అన్నారు. దళితుడైన రాంనాథ్ కోవింద్ తోపాటు గిరిజన మహిళైన ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. కుటుంబహితమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగుతోందని..అవినీతి పరులకు ఆయన అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. మోడీ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయన్న ఆయన..ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని తెలిపారు.