
- బీఆర్ఎస్కుఓటేస్తే మూసీలో వేసినట్టే
- వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూఒక్క సీటూ రాదని కామెంట్
- గెలిపిస్తే కేంద్ర నిధులతోఅభివృద్ధి చేస్తం: బండి సంజయ్
- జూబ్లీహిల్స్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్
హైదరాబాద్, వెలుగు: ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యలను వినే నాయకుడికే ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థికి మజ్లిస్ మద్దతు ఇచ్చిందని, హైదరాబాద్ ను ఆ పార్టీ కబంధహస్తాల నుంచి కాపాడుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మంగళవారం నామినేషన్ వేశారు.
కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి హైలంకాలనీ విజయదుర్గ పోచమ్మ ఆలయంలో రాంచందర్రావు, కిషన్ రెడ్డి పూజలు నిర్వహించి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా పరిసరాలు చెత్తాచెదారంగా మారిపోయాయన్నారు. హైదరాబాద్ను సింగపూర్, వాషింగ్టన్ చేస్తానని అబద్ధాలు చెప్పిన గత సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఫామ్హౌస్కే పరిమితం అయ్యారన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడంలో కూడా ఇబ్బంది పడుతోందని, ఇలాంటి ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొద్ది కాలంలోనే రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయడం లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు మాత్రం ఇచ్చారన్నారు. గతంలో కేసీఆర్ లాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా మాటలతో కోటలు కడుతున్నారని ఎద్దేవా చేశారు.
గెలిపిస్తే కేంద్ర నిధులతో అభివృద్ధి: బండి సంజయ్
జూబ్లీహిల్స్లో బీజేపీని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని, ఆ రెండు పార్టీలు కలిసి దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీల పాలనలో జూబ్లీహిల్స్ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి స్థలాన్ని మజ్లిస్ కు ధారాదత్తం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పై కోపంతో బీఆర్ఎస్ కు ఓట్లేస్తే ఇక అంతే సంగతులన్నారు. బీజేపీని గెలిపించాలని, ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే పట్టించుకోరని, హరీశ్ రావు చెబితే మాత్రం ఎన్ కౌంటర్లు చేస్తారన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కాంగ్రెస్ కు మద్దతిస్తే, ఆయన తమ్ముడు బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ, మజ్లిస్ మధ్యే పోటీ: రాంచందర్రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ, మజ్లిస్ మధ్యే ప్రధాన పోటీ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారని తెలిపారు. కాలనీల్లో డ్రైనేజ్ వాసనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు గతంలో ఏ ప్రభుత్వమూ అభివృద్ధి, పథకాల అమలులో ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు.
ఆరు గ్యారెంటీల పేరిట 421 వాగ్దానాలు చేసి, మళ్ళీ ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య, మాజీ మంత్రి కృష్ణయాదవ్, ఆ పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, గౌతమ్ రావు, బండ కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.