రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది:కిషన్ రెడ్డి

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది:కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎంకు ఆహ్వాన లేఖ పంపామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పర్యటనకు సంబంధించి స్వయంగా కేంద్రమంత్రి లేఖ రాశారని వెల్లడించారు.  రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు వచ్చిన సీఎం కేసీఆర్.. ప్రారంభోత్సవానికి రావడానికి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. 11, 12వ తేదీల్లో  ప్రధాని మోడీ పర్యటన ఉంటుందన్నారు. ఈ పర్యటనలో భాగంగా  తెలంగాణాతో పాటు ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో  మోడీ పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్రంలో  జాతీయ రహదారులకు భూమి పూజతో పాటు.. రామగుండం ఎరువుల కర్మాగారం, రైల్వే ప్రాజెక్ట్‌లను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని తెలిపారు.  తెలంగాణలో రూ.9596 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించనున్నారని చెప్పారు. 

యూరియా కొరత తీరింది..
రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ వల్ల తెలంగాణలో యూరియా కొరత లేకుండా పోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూరియా కోసం దేశంలో ఏ రాష్ట్రం కేంద్రప్రభుత్వానికి లేఖలు రాయాల్సిన అవసరం లేదన్నారు. యూరియా తయారీలో దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా సాగుతోందని చెప్పారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ను అడ్డుకునేందుకు నీమ్ కోటెడ్ యూరియాను ప్రవేశ పెట్టామన్నారు. రామగుండం పరిశ్రమ పునరుద్దరణ కోసం రూ. 6 వేల 300 కోట్లు కేంద్రం ఖర్చు చేసిందన్నారు. 300 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్, కార్మికుల కోసం టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 50 కేజీల బస్తా యూరియా తయారీ ఖర్చు 3 వేలు అయితే రైతులకు కేవలం 600 రూపాయలకు మాత్రమే ఇస్తున్నామన్నారు.

పరిశ్రమ ప్రారంభం కాకుండా అడ్డుకునే ప్రయత్నం..
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేరుతో రామగుండం ఎరువుల పరిశ్రమ ప్రారంభం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పనులు చేసి విఫలం అయ్యిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం తగ్గించేందుకు ప్రధాని ఆదేశాలతో గ్రీనరీ పెంచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.  అనేక రకాలుగా ఏర్పడిన సమస్యలను అధిగమించి గత రెండు మూడు నెలల నుండి ట్రయల్ రన్ చేసి విజయవంతం అయ్యామన్నారు. అటు తెలంగాణ లో 2014 నుండి ఇప్పటి వరకు జాతీయ రహదారులను లక్షా 4 వేల కోట్లతో అభివృద్ధి చేసామని కిషన్ రెడ్డి తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయని...రీజినల్ రింగు రోడ్డు పూర్తయితే..తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ఎంత త్వరగా పూర్తి చేస్తే రింగ్ రోడ్డు పనులు అంత త్వరగా పూర్తవుతాయన్నారు.