ఫాంహౌస్ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు : కిషన్ రెడ్డి

ఫాంహౌస్ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు : కిషన్ రెడ్డి

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో కేసీఆర్ చూపించిన వీడియోలో ఏమిలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బయటివాళ్లతో బేరసారాలు చేసే కర్మ తమకు లేదన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలని.. బ్రోకర్ల ద్వారా పార్టీలో ఎవరిని చేర్చుకోమని చెప్పారు. 100 కోట్లు కాదు 100పైసలకు కూడా ఆ ఎమ్మెల్యేలను ఎవరు కొనరని ఎద్దేవా చేశారు. ఫాంహౌజ్ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. 

ఫాంహౌస్ ఘటనలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వచ్చారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని అడిగారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని విమర్శించారు. స్వామిజీలతో ప్రభుత్వం కూలిపోతుందా అని ప్రశ్నించారు. ఎన్నో పార్టీల గొంతు నొక్కి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్.. ప్రజాస్వామ్యాన్ని బతికించండి అనడం సిగ్గుచేటన్నారు. 

తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు. మునుగోడు బైపోల్ తర్వాత కేసీఆర్లో ఆందోళన పెరిగిందన్నారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన ఘటనలో కేసీఆర్ లేడా అని ప్రశ్నించారు.