బీఆర్ఎస్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం: కిషన్ రెడ్డి

పార్లమెంట్లో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సీఎం రాజ్యాంగాన్ని పదే పదే అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీలను ఏ మాత్రం పట్టించుకోని ఆయన.. గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతిని సైతం గౌరవించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేసిన బీఆర్ఎస్.. తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేస్తామనడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని.. ప్రజలే వారిని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.