సికింద్రాబాద్​లో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పర్యటన

సికింద్రాబాద్​లో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పర్యటన

సికింద్రాబాద్, వెలుగు: తార్నాక విజయపురికాలనీ నుంచి మల్కాజిగిరి వైపు వెళ్లే దారిని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెరిపించారు. గతంలో ఈ దారిని రైల్వే అధికారులు మూసివేయగా, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ ప్రజలు, నాయకులు సమస్యను కిషన్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆదివారం ఓపెన్​ చేయించారు. అలాగే సికింద్రాబాద్ ​నియోజకవర్గంలోని తార్నాక, లాలాపేట, మెట్టుగూడ, పాతమెట్టుగూడ, రాంగోపాల్‌‌‌‌పేట రైల్వే అధికారులు, నాయకులతో కలిసి కిషన్​రెడ్డి పర్యటించారు. మెట్టుగూడ నుంచి సీతాఫల్ మండి వైపు వెళ్లే దారిలో ఇరుకైన అండర్​పాస్​లతో ఇబ్బందిగా ఉందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అనంతరం కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన రైల్వే సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి రైల్వే అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా ఉంటూ పరిసరాలను క్లీన్​గా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చాలా బస్తీల్లో నల్లా నీళ్లు కలుషితమై సరఫరా అవుతున్నాయని, స్ట్రీట్ ​లైట్లు వెలగడం లేదని, పార్కులు బాగోలేవని, పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్స్​ లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్​ ఏకే గుప్తా, మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి, కార్పొరేటర్లు చీరా సుచిత్ర, కొంతం దీపిక, బీజేపీ మహంకాళి జిల్లా నాయకులు శ్యాంసుందర్​గౌడ్, సారంగపాణి, శారదామల్లేశ్, రాము  పాల్గొన్నారు.