దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులు, ఎంపీలకు కరోనా సోకింది. తాజాగా మరో కేంద్ర మంత్రికి కూడా కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కూడా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా వైరస్ నిర్ధారణ అయ్యిందని, రెండురోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విటర్లో వెల్లడించారు.
కాగా పార్లమెంట్ సభ్యులకు ఇప్పటికే దాదాపు 25 మందికిపైగా కరోనా పాజిటీవ్ వచ్చిది. దాదాపు మరో 50మంది పార్లమెంట్ సిబ్బంది కూడా ఈ వైరస్ బారినపడినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో సభలు కొనసాగుతుండగానే బుధవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకిన తరువాతి రోజే ప్రహ్లాద్ సింగ్ పటేల్కు కరోనా నిర్ధారణ కావడంతో సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది.