
ఉప్పల్, వెలుగు: బోనాల పండుగ డ్యూటీలో ఉన్న ఉప్పల్ ఎస్ఐ, కానిస్టేబుళ్లపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ సీఐ ఆదేశాలతో రామంతాపూర్ భరత్ నగర్లో ఆదివారం రాత్రి జరిగిన కిరణ్ డైమండ్ ఫలహారం బండి ఊరేగింపు బందోబస్తుకు ఎస్ఐ మధుసూదన్, కానిస్టేబుళ్లు వెళ్లారు. ఊరేగింపు సమయంలో ఓట్స్ వ్యాగన్ కారులో రాష్ డ్రైవింగ్ చేస్తూ జనంపైకి వచ్చిన యువకులను పోలీసులు అడ్డుకోగా, వారు కారు వదిలి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు తనదంటూ వచ్చి దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు అతడిని, కారును ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
అనంతరం 8 నుంచి-9 మంది యువకులు వచ్చి విధుల్లో ఉన్న పోలీసుల కాలర్ పట్టుకొని కర్రలతో దాడి చేశారు. దాడి నుంచి తప్పించుకున్న పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దాడి చేసిన అనిల్, లక్ష్మణ్, రామరాజు, క్రాంతితోపాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిలో లక్ష్మణ్ అనే యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వీరి ఫొటోలు అక్కడి బీఆర్ఎస్ ఫ్లైక్సీలో ఉండడంతో.. ఆ పార్టీకి చెందిన వారిగా తెలుస్తుంది.